ఇద్దరి ప్రాణాలు తీసిన కలుషిత నీరు.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా..?

by  |
protest for water
X

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలోనీ ఎస్సీ కాలనీలో గల తాగునీటి ట్యాంకు పంచాయతీ అధికారులు గత కొన్ని నెలలుగా శుభ్రం చేయక నీరు కలుషితమై గ్రామంలో ఇద్దరు మృతి చెందారు అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ కాలనీలో విషజ్వరాలు రావడంతో త్రాగునీరు వలనే ఇలా జరిగిందని అనుమానం వచ్చి ట్యాంక్ పైకి గ్రామస్తులు ఎక్కి చూడగా, అడుగు భాగం మొత్తం బురదమయంతో ఉండి అపరిశుభ్రంగా ఉండటంతో ఖంగుతిన్నారు. గ్రామస్తులు రోజు ఈ నీరు త్రాగడం వలనే తమకు విషజ్వరాలు వచ్చాయని అధికారులు నిలదీయడంతో అధికారులు మిషన్ భగీరథ నీరు వలన ఇలా జరిగిందని తెలిపారు. గ్రామస్తులు ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మిషన్ భగీరథ నీరు వలన తమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని కేవలం ట్యాంక్ శుభ్రం చేయకపోవడం వలనే తమకు విష జ్వరాలు వచ్చాయని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో వెంటనే అధికారులు తప్పు ఒప్పుకొని గ్రామస్తులకు సర్దిచెప్పి, వెంటనే నారాయణపురం గ్రామంలో ఉన్న అన్ని ట్యాంకులను శుభ్రం చేసి పరిశుభ్రమైన త్రాగునీరు అందించారు. ఇదే గ్రామానికి చెందిన నీరు త్రాగి వారం రోజుల వ్యవధిలో తుంగ కిట్టయ్య (30), వేల్పుల రాంబాబు (35) ఇద్దరు వ్యక్తులు కామెర్ల బారిన పడి మృతి చెందినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా అనేకమంది గ్రామస్తులు మెరుగైన వైద్యం కోసం భద్రాచలం, ఖమ్మం, సత్తుపల్లి పట్టణాల్లో ఉన్న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

patients in hospital

గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు

విష జ్వరాలు, కామెర్ల బారినపడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామస్తులకు వైద్య అధికారులు స్పందించి వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తిన వెంటనే సమాచారం అందించాలని. ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. కొన్ని రోజుల పాటు గోరువెచ్చటి నీరు తాగాలని అధికారులు గ్రామస్తులు సూచించారు.

Next Story

Most Viewed