స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడో..?

by  |
స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడో..?
X

దిశ, ముషీరాబాద్: నియోజకవర్గంలో రూ.426కోట్లతో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు, రాంనగర్ నుంచి బాగ్ లింగంపల్లి వరకు నిర్మించనున్న బై-డైరెక్షనల్ ఎలివేటెడ్ కారిడార్ (స్టీల్ బ్రిడ్జి) నిర్మాణ పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. జూలై 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ యాదవ్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. రూ.350కోట్లతో ఇందిరాపార్కు- వీఎస్టీ కారిడార్, రూ.76కోట్లతో రాంనగర్- బాగ్ లింగంపల్లి కారిడార్ల పనులు రెండు దశల్లో జరుగుతాయని, 24 నెలల్లో వాహనదారులకు స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ ఐదు నెలలు గడిచినా పనులు ప్రారంభానికి నోచుకోలేదు.

నగరం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రతి నిత్యం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందిరాపార్కు చౌరస్తా, అశోక్ నగర్ చౌరస్తా, వీఎస్టీ చౌరస్తా, హిందీ మహావిద్యాలయ చౌరస్తాలు నిరంతరం ట్రాఫిక్ రద్దీతో దర్శనమిస్తుంటాయి. ప్రధానంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పరిస్థతి మరీ దారుణంగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గతంలో అశోక్ నగర్ నుంచి వీఎస్టీ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ స్థానికుల అభ్యంతరాలు, మెట్రోరైల్ నిర్మాణం తదితర కారణాలతో ప్లైఓవర్ నిర్మాణం ప్రతిపాదనలు మరుగున పడ్డాయి. ఇదిలా ఉండగా అశోక్ నగర్, ఇందిరాపార్కు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు అశోక్ నగర్ – దోమలగూడలను అనుసందానం చేస్తూ హుస్సేన్ సాగర్ నాలాపై లింక్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు అప్పట్లో అదికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిధులు కూడా మంజూరయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల ఉదాసీనత కారణంగా మంజూరైన నిధులు వెనక్కి వెళ్లాయి. దీంతో లింక్ బ్రిడ్జి నిర్మణం కలగానే మిగిలిపోయింది. సమస్య యధాతదంగా ఉంది.

ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చింది. రోడ్ల అభివ్రద్ధి ప్రణాళిక (ఎస్ఆర్‎డీపీ)లో భాగంగా ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు, రాంనగర్ నుంచి బాగ్ లింగంపల్లి వరకు బై- డైరెక్షనల్ ఎలివేటెడ్ కారిడార్ (స్టీల్ బ్రిడ్జి) నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో పనులను పూర్తి చేసేందుకు రూ.426 కోట్లను కేటాయించిది. మొదటి దశలో 350 కోట్ల రూపాయలతో ఇందిరాపార్కు చౌరస్తా, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు 2.620 కి.మీటర్ల పొడవుతో 16.60 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల కారిడార్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అధే విధంగా రెండో దశలో రూ.76కోట్ల 0.850 కి.మీ పొడవు, 13.60 వెడల్పుతో రాంనగర్ నుంచి వీఎస్టీ మీదుగా బాగ్ లింగంపల్లి వరకు కారిడార్ నిర్మించాల్సి ఉంది.

నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తాం..

స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పనులు నెల రోజుల్లో ప్రారంభిస్తాం. నిర్మాణ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని శాఖల అధికారులతో చర్చించాం. విద్యుత్, జలమండలి, గ్రీనరీ కమిటీ ఆధికారులతో కలసి ఫీల్డ్ ఇన్ స్పెక్షన్ పూర్తి చేశాం. గ్రౌండ్ ప్రిపరేషన్ మొత్తం పూర్తయ్యింది. నెల రోజుల్లో ఇందిరాపార్కు-వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి పనులు మొదలు పెడతామని జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఈఈ బి.గోపాల్ తెలిపారు.



Next Story