హుజురాబాద్‌ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్

by  |
huzurabad by poll
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారని భావించిన మాజీమంత్రి కొండా సురేఖ వెనకడుగు వేయడంతో.. కాంగ్రెస్​ నేతలు మళ్లీ వెతుకులాటలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్​ పేరు తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి కూడా హుజురాబాద్​లోనే పోటీ చేయాలనడం, ఒకే టికెట్​ ఇస్తామని కొండా సురేఖకు స్పష్టం చేసిన టీపీసీసీ.. గురువారం రాత్రి నిర్ణయం చెప్పాలని డెడ్ లైన్ విధించింది. అయితే తన షరతులపై టీపీసీసీ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆమె హుజూరాబాద్‌లో పోటీ చేయడంపై వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టిన టీపీసీసీ… తాజాగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ నాయకుడు బల్మూరి వెంకట్ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపడంతో.. తాము కూడా విద్యార్థి నాయకుడైన వెంకట్‌ను బరిలోకి దింపితే బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని పెద్దపల్లి ప్రాంతం కాల్వ శ్రీరాంపూర్​ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన బల్మూరి వెంకట్​ రాష్ట్ర ఎన్​ఎస్​యూఐ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల పలు నిరసనల్లో పోలీసులకు సైతం చుక్కలు చూపిస్తున్నారు. అంతేకాకుండా రేవంత్​రెడ్డి వెంట ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి వెంకట పేరును దాదాపుగా అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వెంకట్ కాంగ్రెస్ పార్టీ నుండి యూత్ లీడర్ గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. యువతలో మంచి పట్టుందని పార్టీ భావిస్తోంది.

టీఆర్ఎస్ అభ్యర్థికి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి

ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, యూత్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ కు సీఎం కేసీఆర్ హుజురాబాద్ అభ్యర్థిగా అవకాశమిచ్చారు. ఇక బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీపడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడికి అవకాశం ఇచ్చినందుకు, గెల్లు శ్రీనివాస్ కు ధీటుగా ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, యూత్ నాయకుడు బలమూర్ వెంకట్ కు అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ లానే ఒకే స్థాయి నాయకుడికి అవకాశం ఇచ్చిందనే నినాదాన్ని కాంగ్రెస్​ ఇవ్వనుందని చెప్పుతున్నారు. కాగా ఈ పోటీపై ఏఐసీసీ నుంచి తన అభిప్రాయం అడిగినట్లు బల్మూరి వెంకట్​ వెల్లడించారు. తాను కూడా పోటీకి సిద్ధమని చెప్పినట్లు వెల్లడించారు.


Next Story

Most Viewed