సీఎం పదవి రాదేమో అన్న బెంగ కేటీఆర్‌లో మొదలైంది.. షబ్బీర్ అలీ కౌంటర్

by  |
Congress leader Shabbir Ali
X

దిశ, కామారెడ్డి: హుజురాబాద్‌లో ఓటమి తర్వాత తనకు ముఖ్యమంత్రి పదవి రాదేమో అన్న బెంగతో మంత్రి కేటీఆర్‌ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ హయాంలో కామారెడ్డి అభివృద్ధి జరగలేదని, షబ్బీర్ అలీ విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ స్పందించారు. కామారెడ్డి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. మా హయాంలో అభివృద్ధి జరగలేదంటే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. లేకుంటే కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తాను చేసిన పనుల గురించి చెప్పారని గుర్తుచేశారు. ‘‘షబ్బీర్ అలీ గారు చేసిన అభివృద్ధి రాష్ట్రం అంతటికి రోల్ మోడల్’’ అని కేసీఆర్ ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. గోదావరి జలాలు తన నియోజకవర్గంలోని ప్రతిఇంటికీ అందించి తాగునీటి గోస లేకుండా చేశానని అన్నారు. తన హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌‌లో 400 కేవీ, డిచ్‌పల్లిలో 400 కేవీ సబ్ స్టేషన్, కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో 220/132 కేవీ సబ్ స్టేషన్‌తో పాటు ప్రతీ మండల కేంద్రంలో 132/33 కేవీ, ప్రతి గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు, వేల సంఖ్యలో కరెంట్ స్తంభాలను ముంజూరు చేశానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క విద్యుత్ స్తంభం కూడా మంజూరు చేయలేదని విమర్శించారు.

రూ.270 కోట్లు ఖర్చు చేసి గోదావరి జలాల ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు అందించామని, రూ.5 కోట్లతో ఇందిరాగాంధీ స్టేడియం నిర్మించామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు డెయిరీ టెక్నాలజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు ఉంటే అందులో ఒకటి కామారెడ్డికి మంజూరు చేయించానని గుర్తుచేశారు. ఇప్పటివరకు దానిని టీఆర్ఎస్ ప్రభుత్వం పీజీ కాలేజీ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. కామారెడ్డి పట్టణంలో రాజీవ్ పార్కు నిర్మించానని, అది తప్ప గడిచిన ఏడేండ్లలో ఒక్క పార్కు దిక్కు లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీ గురుకుల పాఠశాల, హాస్టల్ భవనం నిర్మించానని, సాగునీటి సమస్య తీర్చడానికి ఎంతో కష్టపడి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తమ జిల్లాకు మంజూరు చేయించి 70 శాతం పనులు పూర్తి చేసానని అన్నారు. దానిని ఇప్పుడు పూర్తిచేసే దిక్కు లేదన్నారు. 42 పురాతన ఆలయాలకు ధూప దీప నైవేధ్యం అందించే కార్యక్రమం చేపట్టానని, కామారెడ్డిలో నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చానని, అలాగే నియోజకవర్గంలో దాదాపు 10 వేలకు పైగా ఇళ్లు నిర్మించి నిరుపేదలకు ఇచ్చానన్నారు. టీఆర్ఎస్ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా పేదలకు ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. కామారెడ్డి అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలన్నారు.



Next Story