పోలీసు పరేషాన్.. పోలీసులపై సర్వ సాధారణంగా మారిన ఫిర్యాదులు

by  |
పోలీసు పరేషాన్.. పోలీసులపై సర్వ సాధారణంగా మారిన ఫిర్యాదులు
X

దిశ, శేరిలింగంపల్లి : పోలీసులు అంటేనే శాంతి భద్రతలను కాపాడే రక్షక భటులు. బాధితుల పక్షాన నిలవాల్సిన వ్యక్తులు. ఎక్కడ అన్యాయం, అక్రమం, అరాచకం, అవినీతి జరిగినా తామున్నామని తక్షణం స్పందించే వారు. సమాజంలో శాంతి భద్రతలనే కాదు పౌరుల హక్కులను కాపాడాల్సిన వారు. కానీ ఈమధ్య పోలీసుల మీద సామాన్యుల వద్ద నుండి మొదలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను ప్రవేశ పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే పోలీసులు తమను వేధిస్తున్నారంటూ సామాన్యులు మానవ హక్కుల కమిషన్ దగ్గరకు ఎందుకు క్యూ కడుతున్నారు. పౌరహక్కులకు పోలీసు స్టేషన్ లోనే భంగం వాటిల్లుతుందని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అసలు హైదరాబాద్ నగరంలో పోలీసు వ్యవస్థపై సామాన్యులు ఎందుకు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.

రోజుకో పోలీసు అధికారిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

తమపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్నారు.. తమను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మా హక్కులను కాలరాస్తూ పోలీసు స్టేషన్ కు పిలిపించి నానా ఇబ్బందులు పెడుతున్నారు. మా శత్రువులకు వత్తాసు పలుకుతూ మమ్మల్ని హింసిస్తున్నారు. ఇలా ఏదో ఒక ఫిర్యాదుతో రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించే బాధితుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. చందానగర్ పోలీసు స్టేషన్ నుండి మొదలు బాలానగర్ వరకు పలు స్టేషన్ అధికారుల మీద చాలామంది బాధితులు ఫిర్యాదులు చేసిన ఘటనలు ఉన్నాయి. ఈమధ్య బాలానగర్ సీఐ, ఎస్సైల పై ఓ మహిళా కుటుంబ సభ్యులు హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేయగా అందులో నిజా నిజాలను వెలికితీసి దోషులను జైలుకు పంపారు పోలీసులు. ఇక ఈమధ్యనే జగద్గిరిగుట్ట పోలీసులపై సైతం కొందరు బాధితులు హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. తాజాగా కూకట్‌పల్లి పోలీసులపై అంతకుముందు కేపీహెచ్‌బీ, గతంలో చందానగర్ పోలీసు ఆఫీసర్ మీద సైతం హెచ్‌ఆర్సీకి ఫిర్యాదులు అందాయి.

ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ వచ్చాక ఫిర్యాదుల వెల్లువ

తెలంగాణ సర్కార్ పోలీసులంటే సామాన్యులకు ఉన్న భయాలను పోగొట్టాలనే ఉద్దేశ్యంతో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను అందుబాటులో తీసుకువచ్చింది. దీనివల్ల సామాన్యుల భయాలు పోవడం అటుంచితే పోలీసులు అంటేనే పౌరులకు భయం పోయిందనే చెప్పాలి. గతంలో ఖాకీ డ్రెస్ వేసుకుని కానిస్టేబుల్ కనిపించినా అల్లంత దూరం పరుగెట్టే వారు. కానీ ఇప్పుడు తప్పుచేసిన వారు కూడా పోలీసులంటే లైట్ తీసుకుంటున్నారు. ఏమైనా గట్టిగా అంటే సోషల్ మీడియాలో పెట్టడం, లేదా పోలీసు ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు పోస్టులు చేస్తూ.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే అంటూ ప్రశ్నలు స్పందిస్తున్నారు. చివరకు కేటుగాళ్లు కూడా పోలీసులంటే లైట్ తీసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏ స్టేషన్ లో అయినా పోలీసులు కాస్త గట్టిగా మాట్లాడినా, తప్పు చేసిన వారిని బెదిరించినా.. సరాసరి మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తున్నారు. ఇలా అయితే తామేం చేయాలని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.

పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి

ఈమధ్య కాలంలో పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, ప్రతీ చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ కు పిలిచి వేధిస్తున్నారని వాపోతున్నారు బాధితులు. అధికార పార్టీ పెద్దలకు, లీడర్లకు వత్తాసు పలుకుతూ తమపై లేనిపోని కేసులు బనాయిస్తున్నారని అంటున్నారు మరికొందరు. పేరుకే ఫ్రెండ్లీ పోలీసు తప్పా వాస్తవంలో మాత్రం అదెక్కడా లేదని, రాజకీయ నాయకులు చెప్పిన మాటలకే ప్రాధాన్యత ఇస్తూ తమను పట్టించుకోవడం లేదంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు.

పోలీసుల చేతులు కట్టేశారా..?

ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ స్టార్ట్ అయిన నాటి నుండి తాము చేతులు ముడుచుకుని కూర్చునే పరిస్థితి వచ్చిందని, ఉన్నామా అంటే ఉన్నాం. నాయకులకు సెక్యూరిటీగా, అల్లర్లు జరగకుండా, ధర్నాలు లేకుండా, నేరాల నియంత్రణ చేస్తున్నామే కానీ చివరికి నిందితులను సైతం ఏమీ అనలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. తాము సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేసినా తమకు న్యాయం చేయడం లేదంటూ మానవ హక్కుల కమిషన్ దగ్గరకు వెళుతున్నారని, అసలు మా పని మమ్మల్ని చేసుకోనివ్వడం లేదని పోలీసులు తీవ్రంగా మండిపడుతున్నారు. పోలీసులు అందరూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని, ఎవరి తీరు వారిదని కానీ తామేదో తప్పు చేస్తున్నామని నిందలు వేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. రాజ్యాంగ పరిధిలోనే నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేయడమే తప్పా తమకు ఎవరిపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవని స్పష్టం చేస్తున్నారు పోలీసులు. కానీ పొలీసులపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదులు మాత్రం అందుతూనే ఉన్నాయి.

వారు అనుకున్నది కాకపోతే హెచ్‌ఆర్సీని ఆశ్రయిస్తున్నారు: మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు

పోలీసులు ఎవరింటి చుట్టం కాదు. చట్టానికి లోబడి మా పని మేము చేస్తున్నాం. కానీ చాలామంది తాము అనుకున్న ప్రయోజనాలు నెరవేరక పోయినా, విచారణ జరిగే క్రమంలో, నిజా నిజాలు తేల్చేందుకు కాస్త ఆలస్యం జరిగినా తమకు అన్యాయం చేస్తున్నారని, ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. నిజాలు వెంటనే బయట పడవు. కాస్త ఆలస్యం జరిగినా బాధితులకు న్యాయం చేస్తాం.

Next Story

Most Viewed