‘‘కమ్యూనిస్టుల చీలిక దేశానికి హాని’’

by  |
‘‘కమ్యూనిస్టుల చీలిక దేశానికి హాని’’
X

దిశ, హైదరాబాద్: కారల్ మార్క్స్, ఎంగెల్స్‌లు రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంథాన్ని ప్రముఖ కవి కె.శివారెడ్డి బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఆవిష్కరించారు. నవతెలంగాణ, నవ చేతన పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, ఎంసీపీఐ(యూ) నాయకులు రవి, సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి, ప్రముఖ రచయిత కందిమళ్ల ప్రతాపరెడ్డి హాజరయ్యారు. సభకు కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించి మట్లాడుతూ… కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకాన్ని తెలుగులో లక్ష కాపీలు ముద్రించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. కమ్యూనిస్టులు చీలిపోవడం దేశానికి హానికరం అన్నారు. ఈ గ్రంథం ప్రజలకు అర్ధం కాలేదు కానీ, దోపిడీ వర్గాలకు అర్ధం అయ్యిందన్నారు. నాటి నుంచి నేటి వరకూ అనేక భాషల్లో కోట్ల ప్రతులు ముద్రణ అయ్యిందని తెలిపారు. నవతెలంగాణ పబ్లిషింగ్ జనరల్ మేనేజర్ కోయ చంద్రమోహన్ మాట్లాడుతూ.. తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ, మలయాళం భాషల్లో లక్ష కాపీల చొప్పున ముద్రణ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ప్రజా గాయకురాలు విమలక్క పాల్గొన్నారు.



Next Story

Most Viewed