అమ్ముడుపోవద్దు.. జోకర్ కావద్దు

by  |
అమ్ముడుపోవద్దు.. జోకర్ కావద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఐదేళ్ళకోసారి వచ్చే ఎన్నికల్లో రాజ్యాంగం కల్పించిన హక్కుగా సామాజిక బాధ్యతతో నిజాయితీగా ఓటు వేయాలని ఓ సామాన్యుడు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎంతో విలువైన ఓటును పచ్చనోట్లకు, రంగునీళ్ళకు అమ్ముకోవద్దని వేడుకుంటున్నాడు. “ఓటును అమ్ముకోవడమంటే నీ గోతిని నువ్వు తవ్వుకోవడమే. బీరు, బిర్యానీలకు, మందుకు, కరెన్సీ నోట్లకు ఓటును అమ్ముకోవద్దు. బతుకుల్ని నాశనం చేసుకోవద్దు” అని ఓటర్లకు వినూత్న రీతిలో విజ్ఞప్తి చేస్తున్నాడు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ‘పంచ పాండువులు’లో ఒకడిగా పోటీచేసిన కరీంనగర్ పట్టణానికి చెందిన కోట శ్యామ్ కుమార్ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నగరంలోని పలు కూడలి ప్రాంతాల్లో సోమవారం సర్కస్‌లో జోకర్ వేషధారణలో ఓటర్లకు సందేశం ఇచ్చాడు.

”నేను కాదు జోకర్.. ఓటు అమ్ముకుంటే మీరు అవుతారు జోకర్” అంటూ ప్లకార్డును పట్టుకుని ఖైరతాబాద్, హైటెక్ సిటీ, శిల్పకళా వేదిక, జూబ్లీ చెక్‌పోస్టు తదితర పలు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఓటర్లకు మౌనంగానే విజ్ఞప్తి చేశారు. చూడడానికి తాను జోకర్ అనుకోవచ్చుగానీ ఓటును నోట్లకు, రంగునీళ్ళకు అమ్ముకుంటే చివరకు జోకర్లు అవుతారని వ్యాఖ్యానించారు. ఒక సామాజిక స్పృహ కలిగిన పౌరుడిగా తన వంతు బాధ్యతతో ఓటర్లకు విజ్ఞఫ్తి చేస్తున్నానని, తనను జోకర్ అనుకున్నా ఫర్వాలేదుగానీ, ఓటును అమ్ముకుంటే చివరికి వారే జోకర్లు అవుతారని వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed