కలెక్టర్ సుడిగాలి పర్యటన.. రెండు షాపులు సీజ్

by  |
Collector VP Gautam
X

దిశ,పాలేరు: కూసుమంచి మండలంలో కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు.‌ కూసుమంచి, పాలేరు,నాయకన్ గూడెం గ్రామాల్లో డీర్డీఓ విద్యాచందన, ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, తహసీల్దార్ శిరీషతో కలిసి పర్యటించారు. ఆయా గ్రామాల్లో విలేజీ పార్కులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ, కార్యాలయ రికార్డుల తనిఖీ చేశారు. అనంతరం కూసుమంచి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న విలేజ్ పార్కును సందర్శించారు. అయితే అక్కడ మొక్కలు సరిగా పెరగలేదని, వెంటనే మరికొన్ని మొక్కలను నాటాలని సర్పంచ్ మోహన్‌కు సూచించారు.

కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన

కలెక్టర్ మండల కేంద్రంలోని పీహెచ్‌సీని పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షల రికార్డులను పరిశీలించారు. సీజన్ వ్యాధులు, డెంగీ, మలేరియా కేసులను వివరాలను మండల వైద్యాధికారి శ్రీనివాస్, డాక్టర్ ఇవంజలిన్‌ను అడిగి తెలుసుకున్నారు. డి వార్మింగ్ చేయాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలన్నారు

Collector VP Gautam2

పాలేరులో రెండు షాపుల సీజ్ చేయించిన కలెక్టర్

పాలేరు గ్రామ సెంటర్లో బైక్ మెకానిక్ షాప్‌ల వద్ద టైర్లలో నీటి నిల్వలను గుర్తించి ఎంపీఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కార్యదర్శి ద్వారా రెండు షాపులను సీజ్ చేయించారు. పాలేరులోని పల్లె ప్రకృతి వనానాన్ని సందర్శించారు. అనంతరం నాయకన్ గూడెంలో మెగా పార్క్ నిర్మాణ పనులను పరిశీలించారు. పార్క్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్ కసాని సైదులుకు సూచించారు.

గులాబ్ తుఫానుతో నష్టపోయిన పొలాలు పరిశీలన

నాయకన్ గూడెంలో ఇటీవల గులాబ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులు వరి పొలాలను జిల్లా కలెక్టర్ పీవీ గౌతమ్ పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులతో పంట నష్టం అంచనా వేసి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో జిల్లాలో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

కూసుమంచి తహసీల్దార్ కార్యాలయం తనిఖీ

మండలం విస్తృతంగా పర్యటించి కలెక్టర్ గౌతమ్ కూసుమంచి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయంలో ధరణి పనితీరును తహసీల్దార్ శిరీషను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది? సమస్యలేమన్న ఉన్నాయా అని తెలుసుకున్నారు. అక్కడే ఆవరణలో ఉన్న అర్జీదారులు, రైతుల సమస్యలను నేరుగా వారి వద్దకే వెళ్లి మాట్లాడారు. కలెక్టర్ తో తమ గోడును చెప్పుకున్నారు. వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్, ఆయా గ్రామ సర్పంచులు, కార్యదర్శులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed