విద్యార్థిని మృతిపై విచారణకు ఆదేశం

by  |
విద్యార్థిని మృతిపై విచారణకు ఆదేశం
X

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా వెల్దుర్తి ఎస్సీ గురుకుల కళాశాల విద్యార్థిని పుష్పలత అనుమానాస్పద మృతిపై కలెక్టర్ వీరపాండియన్ ఆదివారం విచారణకు ఆదేశించారు. బాలిక మృతికి గల కారణాలను కలెక్టర్, ఎస్పీ ఫక్కీరప్ప తెలుసుకున్నారు. వెల్దుర్తి పట్టణ సమీపంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థిని పుష్పలత(16) శనివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తోటి విద్యార్థినులతో కలిసి ఉదయం పరీక్షకు హాజరై మధ్యాహ్నం భోజనం ముగించుకుని హాస్టల్‌ గదికి వెళ్లింది. తర్వాత 2 నుంచి 3 గంటల మధ్య స్టడీ అవర్స్‌లో విద్యార్థిని కనిపించలేదు. కేర్‌ టేకర్‌ హరిప్రియ, మరికొందరు విద్యార్థినులు కలిసి వెతికారు. హాస్టల్‌పైభాగం మెట్ల మీద పుష్పలత పడిపోయి కనిపించింది. వెంటనే ప్రిన్సిపాల్‌ సునీతకు సమాచారం అందించారు. విద్యార్థినిని ప్రైవేటు వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని కలెక్టరు ఆదేశించారు.


Next Story

Most Viewed