హుజురాబాద్ ఎఫెక్ట్.. వారిపైనే ఫోకస్ పెట్టిన కొత్త కలెక్టర్

by  |
collector-karnan
X

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ డివిజన్ పరిధిలో 57 ఏండ్లు దాటి వృద్ధాప్య పింఛన్లకు అర్హులైన లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ అన్నారు. గురువారం హుజరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజురాబాద్ డివిజన్ పరిధిలోని మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వృద్ధాప్య పింఛన్ లబ్దిదారుల ఎంపిక, వ్యాక్సినేషన్, గొర్రెల కోసం డీడీలు కట్టని వారి వివరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 57 ఏండ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ క్రమంలో వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని ఎంపీడీఓలను, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. అలాగే, ఆసరా పింఛన్లు పొందుతున్న వారిలో చనిపోయిన వారిని గుర్తించి జాబితా నుంచి తొలగించాలని, ఇంత వరకు 57 ఏండ్లు నిండి పింఛన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

హుజురాబాద్ డివిజన్‌లో 18 ఏండ్లు నిండిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయించాలని, ఎంత మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు, ఇంకా ఎంత మందికి వ్యాక్సిన్ వేయాలనే వివరాలు ఇవ్వాలని కలెక్టర్ అధికారులను కోరారు. గ్రామాల వారీగా, వార్డుల వారీగా వారి జాబితాను తయారుచేయాలని తెలిపారు. అలాగే, 40 ఏండ్ల పైబడిన వారు ఎంత మంది ఫస్ట్ డోసు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.. రెండో డోసు వ్యాక్సిన్ ఎంత మందికి ఇవ్వాలనే జాబితాను సిద్ధం చేసి అందరికీ టీకాలు వేయించాలని కలెక్టర్ ఆదేశించారు. హుజురాబాద్ డివిజన్‌లో ఈనెల 28న రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం జమ్మికుంటలో ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. గొర్రెల యూనిట్లు పంపిణీకి ఇంకా డీడీలు చెల్లించని వారి వివరాలను గ్రామాల వారీగా సేకరించి వెంటనే డీడీలు కట్టించాలని అన్నారు.

Next Story

Most Viewed