తెలంగాణ బీజేపీలో కోల్డ్‌ ‘వార్’?

by  |
తెలంగాణ బీజేపీలో కోల్డ్‌ ‘వార్’?
X

దిశ, వెబ్‌‌డెస్క్: దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో సెన్సేషనల్ హిట్ కొట్టిన బీజేపీలో కోల్డ్‌వార్ మొదలైందా? అధికార, ప్రత్యర్థి పార్టీలంటేనే దూకుడు చూపుతున్న కమలం పార్టీలో మనస్పర్థలు వచ్చాయా ? బయటకు నవ్వుతూ కనపడినా లోలోపల ఒకరంటే ఒకరికి గిట్టడం లేదా? అసలు ఏ విషయంలో నేతలకు పొరపచ్చాలు వచ్చాయి? పార్టీ ఎదుగుతున్న కరెక్ట్ టైంలో ‘ఆ కీలక నేతలు’ ఎందుకు అసంతృప్తితో ఉన్నారు ?.. వాచ్ దిస్ స్టోరీ!

ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కంటే ముందు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా లక్ష్మణ్, కిషన్‌రెడ్డి పని చేశారు. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ హయాంలో రాష్ట్రంలో బీజేపీ ప్రజల్లోకి చొచ్చుకెళ్లలేదు. కానీ కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కు బీజేపీ హైకమాండ్‌ తెలంగాణ రాష్ట్రశాఖ పగ్గాలు అప్పగించాక… పార్టీ రూపురేఖలే మారిపోయాయి. ఇదేక్రమంలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అసాధారణ విజయంతో బండి సంజయ్‌ అంటే ప్రధాని మోడీ, అమిత్ షా దగ్గర పాజిటివ్ ఒపినియన్ ఏర్పడి మరింత ఫ్రీడమ్ ఇచ్చారన్న ప్రచారం ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో తరచుగా వినపడుతోంది. దీంతో సంజయ్ బూత్ లెవల్ నుంచి కాషాయం పార్టీని బలోపేతం చేస్తూ.. అధికార పార్టీ, ఇటు సొంత పార్టీలోనూ కొరకరాని కొయ్యగా మారారన్న టాక్ నడుస్తోంది.

అయితే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి ఓటమిపాలై, 2019 ఎలక్షన్స్‌లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవి వరించింది. ఈ పదవి దక్కాక కిషన్‌రెడ్డి ఎక్కువ టైం ఢిల్లీలోనే ఉంటూ స్టేట్‌లో ఇంపార్టెంట్‌ ప్రోగ్రామ్‌లకు హాజరై.. క్యాడర్‌, అనుచరుల్లో ఉత్సాహం నింపుతూ వచ్చారు. ఈ సమయంలో బండి సంజయ్‌కి రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేతికి రావడంతో.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ సంచలన విజయం క్రెడిట్ మొత్తం ఆయన ఖాతాలోనే చేరింది. దీంతో గతంలో రెండుసార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన కిషన్‌రెడ్డిపై ప్రెజర్‌ పెరిగినట్లయ్యింది.

ఈ నేపథ్యంలోనే పార్టీలోని కొందరు సీనియర్లు, కీలక నేతలు, ఇటీవల బీజేపీలో చేరిన వారు సంజయ్‌తో టచ్‌లో ఉంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే కిషన్‌రెడ్డి.. కేంద్రమంత్రిగా ఉండటంతో ఎక్కువ ఢిల్లీలోనే ఉండాల్సి వస్తోంది. దీంతో స్టేట్‌లో క్యాడర్‌ తగ్గిపోతుందని భావించిన ఆయన.. సంజయ్‌కు ధీటుగా ఇక్కడ తనకు కొత్త అనుచరులు, ఇతర పార్టీల నుంచి చేరిన వారిని తనవైపునకు తిప్పుకునేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి సాధించలేని విజయాలను కొన్నినెలల్లోనే సంజయ్‌ చేసి చూపించి బీజేపీ జెండాను రెపరెపలాడించడంతో.. ఆయన కొంచెం గిల్టీగా ఫీలవుతున్నారని విశ్లేషకుల అభిప్రాయం.

అందుకే ఢిల్లీలో గానీ, రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల్లో గానీ.. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఎదురుపడి మాట్లాడుకున్నా.. లోలోపల మాత్రం ఒకరిపట్ల ఒకరు అసంతృప్తితో ఉన్నారనే గుసగుసలు వినపడుతున్నాయి. అంతేగాక అటు.. పార్టీలోని కొందరు సీనియర్ నేతలు బండి సంజయ్‌ దూకుడును ఇష్టపడక అలకబూనినట్లు కనిపిస్తుండటంతో, తనకు సపోర్ట్ లభించని నేతల పట్ల సంజయ్ సైతం గుర్రుగానే ఉన్నారన్న చర్చ బూత్ లెవల్ క్యాడర్‌లో జరుగుతోంది. మొత్తానికి రాష్ట్రంలో కేడర్‌ను పెంచుకునేందుకు సంజయ్, కిషన్‌రెడ్డి మధ్య కొద్దిగా కోల్డ్ వార్ నడుస్తోందని పొలిటికల్ సర్కిల్‌ చర్చ.



Next Story

Most Viewed