మిడతల దండుతో పెనుముప్పు

by  |
మిడతల దండుతో పెనుముప్పు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రానికి మరోసారి మిడతల దండు ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని రాంటెక్ సమీపంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న ప్రభుత్వం ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5వ తేదీ మధ్య గాలుల దిశను బట్టి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తోంది. దీంతో ప్రగతి భవన్‌లో సంబంధిత అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మిడతల దండు నుంచి పంటల్ని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, సీఐపీఎంసీ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త రహమాన్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులతో సమావేశమైన కేసీఆర్ మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున ఈ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న 8 జిల్లాల అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, మంగపేట, ఏటూరునాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటాల, ధర్మాబాద్, బోధన్, జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల నుంచి మిడతల దండు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

గత నెలలో మూడు విడతలుగా దేశంలో ప్రవేశించిన మిడతల దండ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వరకే వచ్చాయని, తెలంగాణ వైపు రాలేదని అధికారుల సమావేశం సందర్భంగా సీఎం గుర్తుచేశారు. తాజాగా ఓ మిడతల దండు తెలంగాణ సమీపంలోకి వచ్చిందని, రాష్ట్రానికి 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్ దగ్గర ఉందని సీఎంకు అధికారులు వివరించారు. ఒకవేళ దాని ప్రయాణం దక్షిణం వైపు సాగితే, చాలా తక్కువ సమయంలోనే తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం పొంచి ఉందని వివరించారు. మిడతల దండు గమనంపై సమాచారం తెప్పించుకున్న అధికారులు దక్షిణం వైపు కదిలితే ఏ క్షణమైనా తెలంగాణకు ముప్పే అని నిర్ధారణకు వచ్చారు. ఈ నెల 20 నుంచి జూలై 5 వరకు మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సీఎంకు సూచించారు. అప్పటికి తెలంగాణలో వర్షాకాలం పంట సీజన్ ప్రారంభమవుతుందని, కొన్నిచోట్ల పంటలు మొలకెత్తి ఉంటాయని, మిడతల దండు దాడి చేస్తే చాలా నష్టమే జరుగుతుందని, లేత పంట నాశనమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

నేడో రేపో ఆదిలాబాద్‌కు సీఎస్ బృందం

మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్యంలో ప్రత్యేక బృందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, సిఐపిఎంసి ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్. సునీత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త రహమాన్ తదితరులతో కూడిన బృందం ఒకటి రెండు రోజుల్లో ఆదిలాబాద్‌లో పర్యటించనుంది. అక్కడే ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరుగుతుంది. మిడతల దండు గమనాన్ని పరిశీలిస్తూ, అవసరమైన చర్యలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది.



Next Story

Most Viewed