సీజనల్ వ్యాధులపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

by  |
సీజనల్ వ్యాధులపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు మరింత ప్రబలే అవకాశం ఉన్నందున, ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై సీఎం కేసీఆర్ సోమవారం పంచాయతీ రాజ్, వైద్య, మున్సిపల్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

కరోనా నేపథ్యంలో సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న వాళ్లకు, అనుమానితులకు తక్షణమే జ్వర పరీక్షలు చేసి వ్యాధిని నిర్దారించాలన్నారు. అందుకు సంబంధించి అన్ని దవాఖానాల్లో పరీక్షలు, చికిత్స కొరకు పూర్తిస్తాయిలో ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యశాఖను సీఎం ఆదేశించారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రతను కాపాడే చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ మున్సిపల్ శాఖల అధికారులకు సీఎం సూచించారు.

గ్రామాల్లో పట్టణాల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. ఐఆర్ఎస్, ఫాగింగ్ తదితర లార్వా నియంత్రణ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలన్నారు. అవసరమైన మేర మందులు ఇతర సామాగ్రిని సమకూర్చుకోవాలన్నారు. దోమకాటు బారిన పడకుండా పిల్లలు, వృద్ధులను కాపాడుకోవాలన్నారు. ఈ వానాకాలం సీజన్ ముగిసే వరకు వైద్యాశాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ సీజనల్ వ్యాధులను నియంత్రించే చర్యలు చేపట్టాలన్నారు.

వైద్యశాఖ రిపోర్టులు పరిశీలన

వైద్యాధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో అధికారులిచ్చిన రిపోర్టులను సీఎం పూర్తిగా పరిశీలించారు. రూరల్ ఏరియాల్లో మలేరియా, అర్బన్‌లో డెంగీ జ్వరాలు అత్యధికంగా ఉన్నట్లు నివేదికల్లో చూసిన సీఎం వాటి నియంత్రణకు తగిన సలహాలు, సూచనలు చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న 1711 మలేరియా, 1206 డెంగీ కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేగాక ప్రతీ పీహెచ్‌సీలో కరోనా, సీజనల్ జ్వరాలకు వేర్వేరు ఓపీ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలు వేగంగా వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.

ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆసీఫాబాద్, వరంగల్ రూరల్, మహబూబాబాద్ వంటి జిల్లాలపై ఫోకస్ పెట్టాలన్నారు. మరోవైపు పాఠశాలలు ప్రారంభిస్తున్న తరుణంలో పిల్లల్లో జ్వరాలు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు విద్యాశాఖతో సమన్వయమై కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దీంతో పాటు కరోనా వ్యాప్తి చెందకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.



Next Story

Most Viewed