ఫెయిలైన ఇంటర్ విద్యార్థుల పరిస్థితేంటి..? ప్రభుత్వ నిర్ణయంపై సస్పెన్స్

by  |
ఫెయిలైన ఇంటర్ విద్యార్థుల పరిస్థితేంటి..? ప్రభుత్వ నిర్ణయంపై సస్పెన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్​ ఫలితాలపై విద్యార్థి సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశాయి. అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులతో పాటు ప్రతిపక్షాలు సైతం ఈ అంశాన్ని విమర్శనాస్త్రంగా ఎంచుకున్నాయి. రాష్ట్ర సర్కార్​ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. శనివారం ఇంటర్మీడియట్​ బోర్డును ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎన్ఎస్​యూఐ నేతలు ముట్టడించారు. దీంతో కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ ​ఫలితాల ఎఫెక్ట్​అటు బోర్డును, ఇటు ప్రభుత్వాన్ని దెబ్బతీసేలా మారడంతో ఏం చేద్దాం, ఎలాంటి నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో బోర్డు, తెలంగాణ సర్కార్​ పడినట్లు తెలుస్తోంది. 4.59 లక్షల మంది పరీక్షలు రాస్తే.. ఏకంగా 2.35 లక్షల మంది ఫెయిలవటంతో ఇంటర్​ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్​ కారణంగా రెండేండ్లు విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. దీంతో వారిని ప్రమోట్​ చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.

తీరా సెకండియర్ పాఠాలు జరిగే టైమ్​లో ఇంటర్​ ఫస్టియర్​ పరీక్షలు పెట్టడంతో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారని ఇంటర్​ బోర్డు కూడా అంచనాకు వచ్చింది. అందుకే ఫలితాలను వెల్లడించేందుకు సైతం బోర్డు జాప్యం చేసిందనే విమర్శలు వచ్చాయి. ఫలితాలు వెల్లడించిన తర్వాత రాష్ట్రమంతటా దుమారం చెలరేగటంతో ఇటు ఇంటర్​ బోర్డు.. అటు ప్రభుత్వం తల పట్టుకుంటోంది. ఇప్పుడేం చేద్దామనే విషయమై ఉన్నత స్థాయిలో తర్జన భర్జనలు మొదలయ్యాయి.

ఇంటర్​ బోర్డు వ్యవహారంపై దిద్దుబాటు చర్యలకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఇంటర్మీడియట్ ​బోర్డు సీఎం కేసీఆర్ కు పంపించినట్లు తెలుస్తోంది. మొత్తం ఫెయిలైన స్టూడెంట్లను కూడా మినిమమ్​ మార్కులతో పాస్ చేయడం.. లేదా ఉచితంగా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్​ సదుపాయం కల్పించాలని ఇంటర్ బోర్డు ఆలోచిస్తోంది. అవే ప్రతిపాదనలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ముఖ్యమంత్రికి ఫైల్​ను అందజేసినట్లు తెలిసింది. సీఎం తీసుకునే తుది నిర్ణయం మేరకే చర్యలుంటాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఒక వేళ ఇదే జరిగితే 51 శాతం ఫెయిలైన విద్యార్థులకు ఊరట లభించనుంది. సీఎం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోతే.. ఫెయిలైన విద్యార్థులు ఏప్రిల్​లో జరిగే పరీక్షల్లోనే ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండియర్ పరీక్షలు రాయాల్సిందే. కేవలం నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో ఈలోగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే ప్రసక్తి లేదని ఇంటర్​ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈసారి రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్​ ఫీజును సగానికి తగ్గించినట్లు ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది.

ఇంటర్​బోర్డు ముట్టడి

ఫైయిలైన ఇంటర్ ​విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎన్ఎస్​యూఐ నాయకులు ఇంటర్​బోర్డు, విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. ఉచితంగా రీవాల్యుయేషన్ ​చేయాలని వారు డిమాండ్లు చేశారు. ఇంటర్ విద్యార్థుల మృతికి కారకులెవరని ప్రశ్నించారు. కరోనా వల్ల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేస్తున్నాం అని చెప్పి మాట తప్పి పరీక్షలు నిర్వహించడం వల్లే 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్​ స్టాలిన్​ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఇంటర్ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ ఇంటర్మీడియట్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నాయకులు ధర్నా చేశారు. ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక లోపాలను సవరించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి డిమాండ్​ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆన్​లైన్ ​క్లాసుల నిర్వహణలో ఇంటర్ బోర్డు విఫలమైందని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిలబస్ పూర్తి చేయకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం, బోర్డు కారణమయ్యాయన్నారు. విద్యార్థి సంఘాల నేతలు కార్యాలయాలను ముట్టడించి బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.

బషీర్​బాగ్​లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయంలోకి ఏఐఎస్ఎఫ్ ​నాయకులు చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్​ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయమని ప్రశ్నిస్తే అరెస్టు చేయడంపై వారు ఫైరయ్యారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ, ఇంటర్ బోర్డు వైఖరిపై నిరసనగా ఈనెల 21వ తేదీన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ కళాశాల బంద్ కు ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు.

20న ఇంటర్ ​కాలేజీల బంద్​: ఎన్ఎస్​యూఐ

ఇంటర్మీడియట్ ​ఫలితాల్లో జరిగిన తప్పిదాలకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై ఎన్ఎస్​యూఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్​ కళాశాలల బంద్​కు పిలుపునిచ్చారు. ఇంటర్​బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మరణాలపై కనీసం స్పందించకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని, వారి తప్పులను కప్పిపుచ్చుకుంటున్నాయని ఎన్ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ మండిపడ్డారు. బంద్​కు విద్యార్థులంతా మద్దతు తెలపాలని ఆయన కోరారు.

Next Story

Most Viewed