వూహాన్ డైరీలో నిజాలు.. రచయిత్రికి బెదిరింపులు

by  |
వూహాన్ డైరీలో నిజాలు.. రచయిత్రికి బెదిరింపులు
X

న్యూఢిల్లీ : చైనాలో మిగతా దేశాల కంటే పౌర స్వేచ్ఛ తక్కువ. అక్కడ జరిగే ప్రతీ విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పడం నేరంగానే భావిస్తారు. చైనాలో ఏం జరిగినా సెన్సార్ జరిగిన తర్వాతే బయటకు వస్తాయి. మీడియా వార్తలైనా బ్లాగుల్లో రాసే రచనలైనా ప్రభుత్వం నిరంతరం నిఘా పెడుతోంది. దీంతో అక్కడ జరిగే విషయాలు సాధారణంగా బయటకు రావడం కష్టమే. మామూలు రోజుల్లోనే ఇంత నిఘా పెట్టిన చైనా ప్రభుత్వం.. కరోనా వైరస్ ప్రబలిన తర్వాత మరింత కఠిన నిబంధనలు అమలు చేసింది. వూహాన్ నగరంలో వైరస్ కనుగొన్న తర్వాత ఆ నగరాన్ని 100 శాతం లాక్‌డౌన్ చేసింది. అసలు అక్కడేం జరుగుతుందో చైనాలోని వాళ్లకే తెలియదు. అంతెందుకు వూహాన్ నగరంలోనే ఒక చోట జరిగిన ఘటనే మరో వాళ్లకు తెలియకుండా పూర్తి కట్టడి చేశారు. అయితే, చైనాలో అత్యున్నత సాహిత్య పురస్కారం పొందిన రచయిత్రి ఫాంగ్‌ఫాంగ్ ఎప్పటికప్పుడు వూహాన్ నగరంలో ఏం జరిగిందో ఒక ఆన్‌లైన్ డైరీని రాసుకొచ్చింది. ఆమె వూహాన్‌కే చెందిన వ్యక్తి కావడంతో లాక్‌డౌన్ సమయంలో తాను చూసిన, తెలుసుకున్న విషయాలపై ప్రతీ రోజు ఆన్‌లైన్ డైరీని రాశారు. 64 ఏండ్ల ఆ రచయిత్రి పూసగుచ్చినట్లు రాసిన విషయాలు ఇప్పడు ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించబడి విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్నాయి. కరోనా వైరస్‌పై పలు దేశాలు చైనాను వేలెత్తి చూపుతున్న సమయంలో ఫాంగ్‌ఫాంగ్ డైరీ అగ్నికి ఆజ్యం పోసేలా తయారైంది. దీంతో ఆ రచయిత్రిపై చైనీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీయులకు ఆధారాలు అందిస్తున్నావని విమర్శించడమే కాదు.. ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయి. రచయిత్రి ఫాంగ్‌ఫాంగ్ వూహాన్ పరిస్థితులు, ప్రజల జీవనం ఎలా ఉండేదో కండ్లకు కట్టినట్లు రాసింది. ప్రజల్లో భయం, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహంతో పాటు అధికారుల చర్యల గురించి కూడా కూలంకషంగా రాశారు. వూహాన్‌లోని ఈస్ట్‌లేక్ చిత్రాలు బయట ప్రపంచానికి తెలిసేలా పోస్టు చేసింది కూడా ఈమే. పూర్తి నిర్బంధంలో ఉన్న వూహాన్ నగరంలోని ఇండ్లలోకి సూర్యుని వెలుగు వచ్చినా ప్రజలు సంతోషిస్తున్నారంటూ ఆమె పేర్కొనడం చైనా ఎంత నిర్బంధంగా వ్యవహరించిందో తెలిపేలా ఉందని అంటున్నారు. అంతే కాకుండా చైనా కమ్యూనిస్టు పార్టీ చేసిన తప్పులను కూడా ఆమె డైరీలో ప్రస్తావించారు. నాకు తెలిసిన వైద్య మిత్రులు ఏం చెప్పారంటే.. ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని ముందే తెలుసు.. ఉన్నతాధికారులకు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాం.. కాని వాళ్లెవరూ ప్రజలను హెచ్చరించలేదు అని చెప్పినట్లు ఆమె డైరీలో రాసుకొచ్చారు. ఆస్పత్రుల్లో కొత్త రోగులను చేర్చుకోకపోవడంతో వాళ్లు ఇండ్లలోనే మరణించడం.. వైద్యులు, ఇతర సిబ్బందికి సరైన రక్షణ కవచాలు ఇవ్వకపోవడంతో వాళ్లు కూడా వ్యాధి బారిన పడి మరణించడం వంటి విషయాలను డైరీలో రాయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

Tags: china, writer, threatening, calls, revealed, apress

Next Story

Most Viewed