బతుకు భారమై బాల్యం బందీ.. ఆర్థిక సమస్యల వల్లే ఈ దుస్థితి

by  |
Child labor in telangana
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బాల కార్మికులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. పాఠశాలల్లో చదువుకోవాల్సిన వారి బాల్యం బందీగా మారుతోంది. ఇదివరకున్న ఆర్థిక సమస్యలకు తోడు కొవిడ్ కూడా వారి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కరోనా కారణంగా ఎన్నో సంస్థలు, వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. దీంతో అమాయక చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. కుటుంబ పోషణ భారమై కన్న తల్లిదండ్రులే చిన్నారులకు పనిలోకి పంపుతున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను వ్యవసాయ కూలీలుగా మారుస్తుంటే.. మరికొందరు కిరాణా, మెకానిక్‌ షాపులు, ఫర్నీచర్ దుకాణాలు, హోటళ్లలో పనికి పంపుతున్నారు.

Child labors

ఆపరేషన్‌ ముస్కాన్‌ ఫేజ్-7లో భాగంగా 3969 మంది చిన్నారులను తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ రెస్క్యూ చేసింది. ఇందులో 3591 మంది బాలురు, 378 మంది బాలికలను పోలీసులు రెస్క్యూ చేశారు. ఇందులో 2662 మందిని తిరిగి ఇండ్లకు పంపినట్లు పోలీస్ శాఖలోని మహిళా భద్రత విభాగం స్పష్టం చేసింది. 1307 మంది చిన్నారులను రెస్క్యూ హోంకు తరలించింది. ఇందులో 653 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. 509 మంది వీధి బాలలు, చైల్డ్ బాండెడ్ లేబర్లు 1019 మందిని అధికారులు గుర్తించారు. ఇటుక బట్టీల్లో పనిచేసేవారు 17 మంది ఉండగా, భిక్షాటన చేసే 113 మందిని రెస్క్యూ చేశారు. ఇతర పనుల్లో ఉన్న 2311 మందిని అధికారులు గుర్తించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే జీహెచ్‌ఎంసీలోనే ఎక్కువగా బాల కార్మికులున్నారు.

Child labors

ఇప్పటివరకు రెస్క్యూ చేసిన చిన్నారుల్లో సగానికిపైగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే ఉండటం గమనార్హం. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు రాజస్థాన్‌, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌కు చెందిన చిన్నారులే అధికంగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన వారిని బాల కార్మికులుగా మారకుండా ప్రభుత్వ శాఖల సమన్వయంతో స్వయం ఉపాధి కల్పించేందుకు కృషి చేయనున్నారు.

Next Story

Most Viewed