‘కేంద్ర ప్యాకేజీతో గిరిజనులకు ఒరిగిందేంలేదు’

by  |
‘కేంద్ర ప్యాకేజీతో గిరిజనులకు ఒరిగిందేంలేదు’
X

దిశ, న్యూస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీతో గిరిజనులకు ఒరిగిందేమీ లేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఈ ప్యాకేజీతో గిరిజనులకు నేరుగా లబ్ధి చేకూరేది శూన్యమన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చేందుకుగానీ, రవాణా సౌకర్యాలు పటిష్ట పర్చేందుకుగానీ ఏమీ లేవని, ఇకనైనా ఇలాంటి అంశాలపై దృష్టి సారించాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాకు ఆమె విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వివిధ రాష్ట్రాల గిరిజన సంక్షేమ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి అర్జున్ ముండా సోమవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ నేరుగా కేంద్ర మంత్రికే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ గిరిజనుల సంక్షేమానికి మాత్రమే కాక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్దగా ప్రయోజనం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించక ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రజలకు ప్రత్యేక అవసరాలు సమకూర్చారని కేంద్ర మంత్రికి వివరించారు. గిరిజన ప్రాంతాలలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని, లాక్‌డౌన్ సందర్భంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గిరిజన తండాల్లో ఇప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు లేవని, వారి రోజువారీ అవసరాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను వివరించడంతో పాటు కేంద్రం కూడా ఈ వెలుగులో కొన్ని ప్రత్యేక నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed