నీళ్ల జగడాలు.. కేంద్రం పెత్తనం

by  |
నీళ్ల జగడాలు.. కేంద్రం పెత్తనం
X
పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చినట్లయింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి జగడాలు కేంద్రం పెత్తనంలోకి వెళ్లాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు కృష్ణా రివర్ మేనేజ్‌ మెంట్ బోర్డు పరిధిలోనే ఉంటాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషన్ కంట్రోల్‌ను తెలంగాణకు అప్పజెప్పాలని సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు మంత్రి ఈ విధంగా స్పందించారు. నదీ జలాలకు సంబంధించి మంగళవారం తెలుగు రాష్ట్రాల సీఎంలతో వెబినార్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
దిశ, ఏపీ బ్యూరో: గోదావరి జలాల వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి షెకావత్ సూచనప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నామని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను తెలంగాణ సీఎం వ్యతిరేకించారు. దీంతో బోర్డులపై నోటిఫికేషన్ జారీ చేయడానికి అపెక్స్ కౌన్సిల్‌కు అధికారం ఉందని, ఏకాభిప్రాయం ఉండాలన్న నిబంధనేమీ లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదులపై ఈ రెండు రాష్ట్రాలు ఏ కొత్త ప్రాజెక్టు కట్టాలన్నా విధిగా కేంద్రం నుంచి అనుమతులు ఉండాల్సిందేనని, ఇలాంటి ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాల్సిందిగా దీర్ఘకాలంగా బోర్డులు కోరుతున్నా సమర్పిం చడంలేదని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కృష్ణా బోర్డును ఆంధ్రప్రదేశ్‌కు మారుస్తున్నామని వివరించారు.
మరోవైపు అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం లోని సెక్షన్ 3 ప్రకారం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికి తెలంగాణ అంగీకరించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ మీడియాకు వివరాలను వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాలు, వివాదాల పరిష్కారానికేనని చెప్పారు.
తొలి సమావేశం నాలుగేళ్ళ క్రితం 2016లో అప్పటి జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి నేతృత్వంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. రెండో సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, తీసుకున్న నిర్ణయాల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ ఇద్దరు ముఖ్యమంత్రుల ఏకాభిప్రాయంతో జరిగినట్లు తెలిపారు.
చర్చించిన అంశాలు… అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డుల పరిధి, వాటి అధికారాలు (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్), ఈ నదులపై తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, వినియోగం కోసం పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు, కృష్ణా బోర్డును ఏపీకి తరలించడం తదితరాలపై చర్చ జరిగింది. కృష్ణా, గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డుల పరిధి, అధికారాలను నిర్ధారించడానికి నోటిఫికేషన్ జారీ చేయాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరం చెప్పినా కేంద్రానికి అధికారం ఉందని మంత్రి మీడియాకు వివరించారు. ఈ రెండు నదులపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లను సమర్పించేందుకు ఇరువురు సీఎంలు అంగీకరించినట్లు తెలిపారు. ప్రాజెక్టులవారీ కృష్ణా నదీ జలాల వినియోగంపై ట్రిబ్యునల్‌కు పూర్తి నిర్ణయాధికారం ఉంటుందన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికి కేసీఆర్ సమ్మతించినట్లు తెలిపారు.
గోదావరీ నదీ జల వివాదాల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటుకు సీఎంలు అంగీకరించారని మంత్రి వివరించారు. ఇరు రాష్ట్రాల నుంచి వినతులు వచ్చిన అనంతరం ఓ సంవత్సరంలోగా కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డును ఏపీకి తరలించాలని కూడా ఈ సమావేశం నిర్ణయించిందన్నారు. వివాదాల పరిష్కారం కోసం ఏడాదికోసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించడం సమంజసంగా ఉంటుందని స్వయంగా తానే ప్రతిపాదించానని, ఇద్దరు ముఖ్యమంత్రుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు పేర్కొన్నారు.
కృష్ణా నదీ జలాల పంపకాలు ప్రాజెక్టుల వారీగా జరగాలన్న డిమాండుపై సంబంధిత ట్రిబ్యునల్ తీర్పు వెలువరిస్తుందని నొక్కిచెప్పారు. అందుకు అవసరమైన న్యాయ సలహా కౌన్సిల్ తీసుకుంటుందన్నా రు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణను సంబంధిత బోర్డు పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు.
Next Story

Most Viewed