దేశం తలదించుకోవాల్సి వచ్చింది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

by  |
దేశం తలదించుకోవాల్సి వచ్చింది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, ముందుచూపు లేకపోవడం వల్ల కరోనా కేసులు పెరిగి ప్రపంచం ముందు దేశం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు కరోనా బాధితులకు, వారి కుటుంబాలకు చేయూతనందించాలని ఆయన సూచించారు.

దేశంలో రోజుకు నాలుగు లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, వేలాది మంది చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎస్ చేస్తున్న ప్రకటనలకు, వాస్తవాలకు చాలా వ్యత్యాసముందని, కావాలనే పరీక్షలు తక్కువ సంఖ్యలో చేస్తూ కేసులు తక్కువగా ఉన్నట్లు చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. మరణాల సంఖ్యను కూడా తక్కువ చేసి చూపడంపై ఆయన మండిపడ్డారు.

కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. అందువల్లే ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సీజన్, వ్యాక్సిన్ కొరత ఏర్పడిందన్నారు. ఇదే అదునుగా చూసి ప్రైవేట్ మెడికల్ మాఫియా.. రోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఈ ఆపత్కర సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించాలన్నారు. రాష్ట్రంలో పేదలకు భారం కాకుండా కరోనా వైద్యాన్ని వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్యం అందించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



Next Story