విమాన ప్రమాదాల్లో విషాదం.. మరణించిన ప్రముఖులు, హీరోయిన్లు వీరే..

by  |
విమాన ప్రమాదాల్లో విషాదం.. మరణించిన ప్రముఖులు, హీరోయిన్లు వీరే..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో విమాన ప్రమాదాలు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. హెలికాప్టర్లు, విమానాలు అందుబాటులోకి వచ్చాక ప్రయాణం సులువుగా, వేగంగా సాగుతున్నప్పటికీ ప్రమాదాలు కూడా పెరిగాయి. అందుకు ఉదాహారణలుగా చాలా ఘటనలే ఉన్నాయి. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూర్-కూనూర్​మధ్యలో బుధవారం మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్​ప్రమాదమే ఇందుకు నిదర్శనం. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఐఏఎఫ్‌ ఎంఐ-17 హెలికాప్టర్‌ ప్రమాదానికి గురి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ప్రమాదంలో CDS జనరల్ బిపిన్​రావత్, ఆయన భార్య మధులిక రావత్ మృత్యువాడపడ్డారు. వీరిలో పాటు మరో 11 మంది మరణించగా.. కెప్టెన్ వరణు సింగ్ తీవ్ర గాయాలతో మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

హెలికాప్టర్, విమాన ప్రమాదంలో మరణించింది వీరే..

-YS రాజ‌శేఖ‌ర్ రెడ్డి..

తెలుగు ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టింది YS రాజ‌శేఖ‌ర్ రెడ్డి అకాల మరణం. 2009 సెప్టెంబ‌ర్ 2న పావురాల గుట్ట వ‌ద్ద జ‌రిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయ‌న దుర్మరణం చెందారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ఆర్ హెలికాప్టర్‌లో బయలుదేరగా.. పావురాల గుట్ట ప్రాంతంలో హెలికాప్టర్ గ‌ల్లంతైంది. చివ‌ర‌కు పావురాల గుట్ట వ‌ద్ద కుప్పకూలిన‌ట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో వైఎస్ఆర్‌తో పాటు మ‌రో ఐదుగురు సిబ్బంది మ‌ర‌ణించారు. ఆయన మరణ వార్త జీర్ణించుకోలేని YSR అభిమానులు వందల సంఖ్యలో చనిపోయారు.

– నటి సౌందర్య

విమాన ప్రమాదం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా విషాదాన్ని మిగిల్చింది. ఏప్రిల్ 17, 2004లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి వస్తున్న నటి సౌందర్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. బెంగ‌ళూరులోని జ‌క్కూరు విమానాశ్రయం స‌మీపంలో హెలికాప్టర్ కూలిపోవడంతో సౌందర్యతో మృతి చెందారు. చివరి చూపునకు సౌందర్య డెడ్ బాడీ కూడా దొరకనంతగా కాలిపోయింది. దీంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

– కేంద్ర మాజీ మంత్రి మాధ‌వ‌రావు సింథియా

2001 సెప్టెంబ‌ర్‌లో యూపీలోని బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మాధ‌వ‌రావు సింథియా విమాన ప్రమాదంలో మ‌ర‌ణించారు. కాన్పూర్‌కు సమీపంలో ఆయ‌న ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సింథియాతో పాటు మ‌రో ఆరుగురు మృత్యువాత పడ్డారు.

– అరుణాచ‌ల్‌ప్రదేశ్ మాజీ సీఎం ధోర్జీ ఖండూ

అరుణాచ‌ల్‌ప్రదేశ్ మాజీ సీఎం ధోర్జీ ఖండూ 2011లో జ‌రిగిన‌ హెలికాప్టర్ ప్రమాదంలో మ‌ర‌ణించారు. ప్రతికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా ధోర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లోబో తాండ్ వ‌ద్ద కూలింది. ఈ ప్రమాదం రాజకీయంగా పలువురు ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

– సంజ‌య్ గాంధీ

మాజీ ప్రధాన‌మంత్రి ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజ‌య్ గాంధీ విమాన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. 1980 జూన్ 23న ఆయ‌న ప్రయాణిస్తున్న తేలిక‌పాటి హెలికాప్టర్ గ్లైడ‌ర్‌ కూలిపోయింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే విమానం కుప్పకూలింది.

– నటి రాణి చంద్ర

మలయాళం హీరోయిన్‌ రాణి చంద్ర విమాన ప్రమాదంలోనే చనిపోయారు. మిస్ కేరళగా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న రాణి చంద్ర(27).. 1976, 12 అక్టోబర్‌న జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందారు.

– లోక్‌స‌భ మాజీ స్పీక‌ర్‌ జీఎంసీ బాల‌యోగి

ఏపీలోని కృష్ణా జిల్లా కైక‌లూరులో జ‌రిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లోక్‌స‌భ మాజీ స్పీక‌ర్ జీఎంసీ బాల‌యోగి క‌న్నుమూశారు. 2002 మార్చి 3న‌ భీమ‌వ‌రం నుంచి తిరిగివ‌స్తుండ‌గా ఆయ‌న ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక స‌మ‌స్య కారణంగా హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. కొబ్బరి చెట్టును హెలికాప్టర్ ఢీకొనడంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

– హిమాచల్‌‌ప్రదేశ్ మాజీ గవర్నర్ సురేంద్ర నాధ్

హిమాచల్‌‌ప్రదేశ్ మాజీ గవర్నర్ సురేంద్ర నాధ్ జూలై 9, 1994న విమాన ప్రమాదంలో మృతి చెందారు. ప్రభుత్వ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే హిమాచల్‌ప్రదేశ్‌లోని కొండల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు.



Next Story

Most Viewed