విమానం ఎప్పుడొస్తుంది.. గందరగోళంలో ప్రయాణికులు

by  |
విమానం ఎప్పుడొస్తుంది.. గందరగోళంలో ప్రయాణికులు
X

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా దేశీయ విమాన సేవలు అనుకున్నంత సాఫీగా ప్రారంభం కాలేదు. రెండు నెలల తర్వాత సోమవారం ఎయిర్‌పోర్టులకు చేరిన ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. కొన్ని ఎయిర్‌లైన్‌లు అర్ధాంతరంగా విమానాల షెడ్యూల్‌ను రద్దు చేశాయి. మరికొన్ని విమానాలను నిర్దిష్టంగా సమయాన్ని తెలుపకుండా వాయిదాల మీద వాయిదాలు వేశాయి. విమానసంస్థల వెబ్‌సైట్‌లలో స్పష్టంగా ఈ సమయంలో ఫ్లైట్ బయల్దేరుతుందని పేర్కొంటున్నా.. బయట మాత్రం ఆ విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమాన సంస్థలు షెడ్యూల్‌కు రెండు గంటల ముందు విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ప్రయాణికులనే రెండు గంటలకు ముందు ఎయిర్‌పోర్టుకు చేరాలని కేంద్రం సూచించింది. అంటే, ప్రయాణికులు తీరా విమానాశ్రయం చేరాక ప్రయాణాలను రద్దు చేస్తూ ప్రకటించడంపై ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి. ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడ్డారు. దేశవ్యాప్త ఎయిర్‌పోర్టుల్లో ఇవే పరిస్థితులు కనిపించాయి.

ఢిల్లీలో 380 విమానాల రాకపోకలకు ఈ రోజు షెడ్యూల్ ఉన్నది. కానీ, ఇందులో మధ్యాహ్నం వరకే 82 విమానాలు రద్దయ్యాయి. కాగా, బెంగళూరులో 20 విమానాల ప్రయాణాలు రద్దు చేశారు. చివరికి ఒడిషా ఎయిర్‌పోర్టులోనూ ఇదే పరిస్థితి కనిపించింది. పది విమానాల షెడ్యూల్ ఉండగా.. ఐదు రద్దయ్యాయి. ముందస్తు సమాచారం లేకుండా విమాన సేవలను రద్దుచేయడంపై ప్రయాణికులు సోషల్ మీడియాలో మండిపడ్డారు. దీనికితోడు క్వారంటైన్ ప్రక్రియపైనా అసహనం వ్యక్తమైంది.



Next Story

Most Viewed