కరోనా రాదు.. దూరం ‘పెట్’‌వద్దు

by  |
కరోనా రాదు.. దూరం ‘పెట్’‌వద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్యం సంస్థ. చైనా నుంచి ఇతర దేశాలకు సోకిన కోవిడ్ 19 వ్యాధి పేరు తలిస్తేనే జనం హడలిపోతున్నారు. ఈ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రభుత్వం సూచించిన విధానాలను పాటిస్తూ.. ఇళ్లకు పరిమితం అవుతున్నారు. పక్కింటి వారిని చూసేందుకు కూడా భయపడుతున్న ఈ సమయంలో అందరిలో మెదులుతున్న ప్రశ్న.. మరి తాము పెంచుకునే జంతువుల (కుక్కలు, పిల్లులు, పావురాలు లాంటివి) కు కరోనా వస్తుందా అని. ప్రశ్న మెదిలింది సరే.. కానీ సమాధానం వినకుండానే మూగజీవులు ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్నారు కొందరు. కరోనా వల్ల కలిగిన అతి భయంతో వాటి తిండి గురించి పట్టించుకోకుండా దూరం పెడుతూ వాటిని హత్య చేసినవారు అవుతున్నారు.

మార్చి 22 నుంచి 31 వరకు కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించగా ప్రజలంతా ఇంట్లో సేఫ్‌గా ఉంటున్నారు. కానీ, వారు పెంచుకునే జంతువులను తాకాలా? వద్దా? అనే అయోమయంలో ఉన్నారు. వాటిని ముట్టుకుంటే కరోనా సంక్రమిస్తుందేమో అని భయంలో ఉన్నారు. కానీ, అలా ఏమీ జరగదని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ. మీమీ పెంపుడు జంతువులను చక్కగా చూసుకోవాలని సూచిస్తున్నాయి. కుక్కలు, పిల్లుల ద్వారా కోవిడ్ 19 వ్యాప్తి చెందే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రోజులుగా పెట్ హౌజెస్ మూసే ఉన్నాయని… దీంతో వాటికి ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది కేంద్రం. దయచేసి అలా ఆలోచించకుండా మూగజీవాలను కాపాడుకోవాలని కోరుతోంది.

నిజానికి కోవిడ్ 19 వ్యాధి జంతువుల నుంచి మనుషులకు సంక్రమించింది అనే చెప్తున్నాఇప్పుడు మాత్రం మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు డాక్టర్లు. కోవిడ్ 19 ప్రధానంగా ఒక వ్యక్తి దగ్గు, తుమ్ము, మాట్లాడేటప్పుడు ఉద్భవించిన బిందువుల ద్వారా మరొకరికి సోకుతుందని తెలుపుతున్నారు. కాబట్టి చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రతినిధి, ఎపిడెమియాలజిస్ట్ లి లంజువాన్ మీతోపాటు మీ జంతువులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు. పెంపుడు జంతువులు బయటకు వెళ్లి కరోనా సోకిన వ్యక్తితో సంబంధం కలిగి ఉంటే మాత్రం ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. ఆ వ్యక్తి ద్వారా జంతువుల చర్మంపైకి చేరిన వైరస్ వాటికి ఎలాంటి హాని తలపెట్టకపోయినా, మీరు వాటిని ముట్టుకున్నప్పుడు మీకు వైరస్ సంక్రమిస్తుందని చెబుతున్నారు. అందుకే మీతోపాటు మీ పెంపుడు జంతువులకు రక్షణ, శుభ్రత అవసరమని స్పష్టం చేస్తున్నారు. వాటిపై సూక్ష్మక్రిముల వ్యాప్తిని తగ్గించేందుకు పావ్ క్లీనర్, పావ్ వైప్‌లతో తుడిచేయాలని సూచిస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు ప్రపంచంలో పెంపుడు జంతువుల నుంచి మనిషికి కరోనా సోకిందనే ఆధారాలు లేవనే చెబుతున్నారు. కరోనా వైరస్ నుంచి కుక్కలను రక్షించుకోవడానికి కుక్కలకు ఫేస్ మాస్క్ అవసరం లేదంటున్నారు వైద్యులు. మీరు ఇంకా ఆందోళన చెందుతుంటే లేదా మీ కుక్క ఆరోగ్యంలో మార్పును గమనించినట్లయితే పశువైద్యునితో మాట్లాడండి. అన్నింటికన్నా ముఖ్యంగా COVID-19 భయాల కారణంగా యజమానులు తమ కుక్కలు, పిల్లులు లేదా ఇతర పెంపుడు జంతువులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలివేయకూడదు.

కుక్కతో వాకింగ్‌కు వెళ్లొచ్చా?

మరి కుక్కతో వాకింగ్‌కు వెళ్లొచ్చా? అంటే .. ఎస్ .. మీరు భేషుగ్గా వెళ్లొచ్చు అనే చెబుతున్నారు వైద్యులు. కానీ, కరోనా కారణంగా మీ పరిసరాల్లో ఉన్న నిబంధనలు ఫాలో కావడం కంపల్సరీ అంటున్నారు. కుక్కను బయటకు వాకింగ్‌కు తీసుకెళ్లే ముందు తీసుకొచ్చిన తర్వాత మీ చేతులను 20 సెకన్లపాటు పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. వీలైతే శానిటైజర్స్ వెంట పెట్టుకుంటే మంచిదంటున్నారు. పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు కూడా వ్యాయామం చాలా ముఖ్యం కాబట్టి.. బయటకు వెళ్లినప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని సూచిస్తున్నారు. క్రౌడ్ తక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లాలని.. కుక్కలకు మాస్క్‌లు లాంటివి అవసరం లేదని చెబుతున్నారు.

Tags: CoronaVirus, Covid 19, Pet Animals, WHO, Central Govt

Next Story

Most Viewed