- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూజర్లకు అలర్ట్.. టారిఫ్ ప్లాన్ల పెంపుపై వొడాఫోన్ ఐడియా కీలక ప్రకటన
వొడాఫోన్ ఐడియా టారిఫ్ ల పెంపుపై కీలక ప్రకటన చేసింది. అన్ని సంస్థల మాదిరిగా తాము యూజర్లపై భారం మోపబోమని పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా (Vi) తమ మొబైల్ టారిఫ్ ప్లాన్లలో స్వల్ప సవరణలు చేయాలని నిర్ణయించింది. అయితే.. ప్రస్తుతం ప్లాన్ల ధరలను అందరికీ వర్తించేలా భారీగా పెంచే యోచన ఏదీ లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగిన 'COAI డిజికామ్ సమ్మిట్ 2026' సందర్భంగా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ ఈ విషయాలను వెల్లడించారు. మార్కెట్లో ఇతర సంస్థలు ప్లాన్ల రేట్లను పెంచేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇటీవల భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను దాదాపు 4 నుండి 5 శాతం వరకు పెంచింది. ఈ క్రమంలో.. ఈ ఏడాది ప్రథమార్థంలో టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను సుమారు 15 శాతం మేర పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు. దీనిపై అభిజిత్ కిషోర్ స్పందిస్తూ.. ప్లాన్లలో చిన్న చిన్న మార్పులు మాత్రమే ఉంటాయని, టారిఫ్ లను భారీగా పెంచబోమని తెలిపారు. వోడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కంపెనీలో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని, తమపై ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని తాము విలువైనదిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ దృష్టంతా కంపెనీ పనితీరును మెరుగుపరచడంపైనే ఉందని, ఇప్పటికే వినియోగదారుల చేరికలో మార్పు కనిపిస్తోందని ఆయన తెలిపారు.
టెలికాం రంగంలో వోడాఫోన్ ఐడియా (Vi) విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. భారత టెలికాం నియంత్రణ మండలి (TRAI) విడుదల చేసిన మార్చి 2026 గణాంకాల ప్రకారం.. కంపెనీ మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య పెరిగినప్పటికీ, ప్రధానమైన కన్జ్యూమర్ మొబైల్ విభాగంలో మాత్రం వినియోగదారులు తగ్గుతూనే ఉన్నారు. మెషీన్-టు-మెషీన్ (M2M) కనెక్షన్ల వృద్ధి కారణంగానే మొత్తం గణాంకాల్లో సానుకూలత కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రాయ్ నివేదిక ప్రకారం.. మార్చి 2026 నాటికి వోడాఫోన్ ఐడియా మొత్తం వైర్లెస్ సబ్స్క్రైబర్ బేస్ 19.84 కోట్లుగా నమోదైంది. ఫిబ్రవరిలో కేవలం 21,927 మంది కొత్త వినియోగదారులు చేరగా, మార్చిలో ఆ సంఖ్య 1,02,899కి పెరిగింది. అయితే.. ఈ వృద్ధి వెనుక అసలు కారణం ఎం2ఎమ్ (M2M) సెగ్మెంట్. ఫిబ్రవరిలో 19.32 మిలియన్లుగా ఉన్న ఎం2ఎమ్ కనెక్షన్లు, మార్చి నాటికి 19.58 మిలియన్లకు (అంటే 2.6 లక్షల పెరుగుదల) చేరాయి. సాధారణ మొబైల్ ప్లాన్లతో పోలిస్తే ఈ విభాగం నుండి వచ్చే సగటు ఆదాయం (ARPU) చాలా తక్కువగా ఉంటుంది.
మరోవైపు కంపెనీకి అసలైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే కన్జ్యూమర్ మొబైల్ సిమ్ (Consumer SIM) విభాగం వరుసగా క్షీణిస్తోంది. ట్రాయ్ వర్గీకరణ ప్రకారం లెక్కించగా.. మార్చి నెలలో సుమారు 1.6 లక్షల మంది సాధారణ మొబైల్ వినియోగదారులు వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ నుండి తప్పుకున్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో కూడా ఈ విభాగంలో దాదాపు 4.9 లక్షల మంది వినియోగదారులు తగ్గినట్లు అంచనా. ముఖ్యంగా ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ వంటి కీలక ప్రాంతాల్లో కంపెనీ చందాదారులను కోల్పోయింది.






