దేశీయ మార్కెట్లోకి అమెరికా పిజ్జా కంపెనీ రీ-ఎంట్రీ!

by Disha Web Desk 17 |
దేశీయ మార్కెట్లోకి అమెరికా పిజ్జా కంపెనీ రీ-ఎంట్రీ!
X

బెంగళూరు: అమెరికాకు చెందిన ప్రముఖ పిజ్జా రెస్టారెంట్ కంపెనీ పాపా జాన్స్ భారత్‌లో పెద్ద ఎత్తున రిటైల్ ఔట్‌లెట్లను ప్రారంభించాలని భావిస్తోంది. అందుకోసం పీజేపీ ఇన్వెట్‌మెంట్స్ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మొదటి రెస్టారెంట్‌ను 2024 నాటికి బెంగళూరులో ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. 2033 నాటికి దేశవ్యాప్తంగా 650 ఔట్‌లెట్లను అందుబాటులోకి తీసుకురానుంది.

పాపా జాన్స్ ఇదివరకు కూడా భారత్‌లో వ్యాపారాలను నిర్వహించింది. అయితే, ఆ తర్వాత పిజ్జా హట్, డొమినోస్ వంటి పాపులర్ బ్రాండ్లతో పోటీ పడలేక 2017లో తన రెస్టారెంట్లను మూసేసింది. తాజాగా తిరిగి భారత మార్కెట్లో ప్రవేశించాలని, ముందుగా దక్షిణాదిలోకి అడుగుపెట్టిన తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు విస్తరించాలనే ప్రణాళికను కలిగి ఉంది.

భారత్‌లో పిజ్జాలకు పెరుగుతున్న గిరాకీ, వినియోగదారుల ఖర్చులను పరిగణలోకి తీసుకుని వృద్ధికి అవకాశం ఉందని పాపా జాన్స్ అభిప్రాయపడింది. పాపా జాన్స్ విస్తరణ ద్వారా పిజ్జాను కొత్త వినియోగదారులు ఆదరిస్తారు. కంపెనీతో భాగస్వామ్యం ద్వారా తాము వచ్చే పదేళ్లలో సుమారు 1,000 పాపా జాన్స్ రెస్టారెంట్లను నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నట్టు పీజేపీ సీఈఓ తపన్ వైద్య పేర్కొన్నారు.

Next Story