UPI: మరింత స్మార్ట్‌గా యూపీఐ

by S Gopi |

ఇంట్లో వాడే వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జ్, స్మార్ట్‌వాచ్‌లన్నీ ఇకమీదట యూపీఐ లావాదేవీలు చేయవచ్చు.

UPI: మరింత స్మార్ట్‌గా యూపీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థిక రంగాన్ని మార్చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) వ్యవస్థ మరింత స్మార్ట్‌గా మారనుంది. చేతికుండే స్మార్ట్‌వాచ్‌తోనే మెట్రో టికెట్ కొనే సౌకర్యంతో పాటు పార్కింగ్ ఫీజును కారే స్వయంగా చెల్లించే విధంగా భవిష్యత్తులో యూపీఐలో మార్పులు తీసుకొచ్చేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) రెడీ వెర్షన్ యూపీఐని రూపొందిస్తోంది. దీనివల్ల మనుషుల అవసరం లేకుండా ఇంట్లోని వేరియబుల్స్, కనెక్టెడ్ వెహికల్స్, ఇతర పరికరనాలు వాటికవే చెల్లింపులు చేయగలవు. దీనర్థం ఇంట్లో వాడే వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జ్, స్మార్ట్‌వాచ్‌లన్నీ ఇకమీదట యూపీఐ లావాదేవీలు చేయవచ్చు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల కోసం చేతిలో మొబైల్ ఉండాలి, అందులో విడిగా యూపీఐ విడిగా ఉండాలి. తాజాగా యూపీఐ సర్కిల్ ద్వారా ఒక యూజర్ బ్యాంక్ అకౌంట్ నుంచి సెకండరీ యూజర్ చెల్లించే సదుపాయాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆటోపేమెంట్ సదుపాయం కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. ఎన్‌పీసీఐ డెవలప్ చేస్తున్న విధానంలో అన్ని రకాల డివైజ్‌లు ప్రైమరీ అకౌంట్‌కు లింక్ అయి ఉంటాయి. ఆయా డివైజ్‌లకు విడిగా యూపీఐ ఐడీ ఉంటుంది. వన్‌టైమ్ అథెంటికేషన్ ద్వారా డివైజ్‌లు అనుసంధానం అవుతాయి. ఒకసారి ప్రైమరీ యూజర్ అనుమతిచ్చిన తర్వాత వ్యక్తి అవసరం లేకుండా చెల్లింపులు జరుగుతాయి. ప్రస్తుతం ఈ విధానం అనుమతి కోసం ఎన్‌పీసీఐ ఎదురుచూస్తోంది.

Next Story