PSBs: ఐదేళ్లలో రూ. 6.15 లక్షల కోట్లు రుణాలను రైటాఫ్ చేసిన పీఎస్‌బీలు

by S Gopi |

రైటాఫ్‌ మొత్తం ఎక్కువగా ఉన్నప్పటికీ, బ్యాంకుల ఆర్థిక పనితీరు సమర్థవంతంగా కొనసాగుతున్నాయి.

PSBs: ఐదేళ్లలో రూ. 6.15 లక్షల కోట్లు రుణాలను రైటాఫ్ చేసిన పీఎస్‌బీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజా డేటా ప్రకారం, గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) రూ. 6 లక్షల కోట్లకు పైగా విలువైన రుణాలను రైటాఫ్ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పీఎస్‌బీలు రూ. 6.15 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. అయితే, రైటాఫ్‌ మొత్తం ఎక్కువగా ఉన్నప్పటికీ, బ్యాంకుల ఆర్థిక పనితీరు సమర్థవంతంగా కొనసాగుతున్నాయి. పీఎస్‌బీల్లో లాభాలు మెరుగ్గా ఉండటంతో 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎస్‌బీల్లోకి కేంద్రం ఎలాంటి మూలధన సాయాన్ని అందించలేదని చెప్పారు. రైటాఫ్‌ల మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1.33 లక్షల కోట్లకు చేరాయి, ఆ తర్వాత 2021-22లో రూ.1.16 లక్షల కోట్లకు తగ్గాయి. మళ్లీ 2022-23లో రూ.1.27 లక్షల కోట్లకు పెరిగాయి. రైటాఫ్ చేసినప్పటికీ గత ఐదేళ్లలో పీఎస్‌బీలు రైటాఫ్ చేసిన రుణాల నుంచి రూ.1.65 లక్షల కోట్లు తిరిగి సమీకరించాయి.

కొంతకాలంగా ప్రభుత్వం నుంచి మూలధన నిధుల సహకారం లేకపోయినా, పీఎస్‌బీలు మార్కెట్ల నుంచి, అంతర్గతంగా నిధులను సేకరిస్తున్నాయి. 2022 నుంచి 2025 సెప్టెంబర్ 30 మధ్యకాలంలో పీఎస్‌బీలు మార్కెట్ ఫైనాన్సింగ్ ద్వారా రూ. 1.79 లక్షల కోట్లను సమీకరించాయి. ఆర్‌బీఐ నిబంధనలు, బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం, నాలుగేళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే బ్యాంకులు రైటాఫ్ ప్రక్రియను చేపడతాయి. కానీ, ఈ ప్రక్రియ వల్ల రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించకుండా ఉండేందుకు అనుమతి కాదని, సాంకేతికత మాఫీ మాత్రమే అవుతుందని పంకజ్ చౌదరీ వివరించారు. సివిల్ కోర్టులు, రుణాల రికవరీ ట్రిబ్యునల్స్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) వంటి మార్గాల్లో దివాలా చర్యల ద్వారా బ్యాంకులు రికవరీ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.

Next Story