వచ్చే 7 ఏళ్లలో విద్యుత్ రంగానికి రూ. 17 లక్షల కోట్ల పెట్టుబడులు

by Dishanational1 |
వచ్చే 7 ఏళ్లలో విద్యుత్ రంగానికి రూ. 17 లక్షల కోట్ల పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత విద్యుత్ రంగం రాబోయే సంవత్సరాల్లో భారీ పెట్టుబడులను చూడనుందని కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ తెలిపారు. ఈ రంగంలో పెరుగుతున్న సామర్థ్యం కారణంగా ప్రభుత్వం వచ్చే 5-7 ఏళ్లలో రూ. 17 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతుందన్నారు. ఇప్పటికే గడిచిన తొమ్మిదేళ్లలో విద్యుత్ రంగం రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం దాదాపు 85 గిగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుతున్నామని, మరో 14-15 గిగావాట్ల క్లియరెన్స్ దశలో, 14 గిగావాట్ల హైడ్రో ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రముఖ మేగజైన్ మెషినిస్ట్ నిర్వహించిన 'ఫెస్టివల్ ఆఫ్ మాన్యూఫక్చరింగ్-2024' కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి, 'గత 10 ఏళ్లలో ప్రభుత్వం 190 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం పెంచి 436 గిగావాట్లకి పెంచింది. దీనికోసం చాలా థర్మల్, పునరుత్పాదక పరికరాలు అవసరమయ్యాయి. భవిష్యత్తులో విద్యుత్ రంగం అన్ని విభాగాల్లో సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉందని' ఆయన వెల్లడించారు. దీనికోసం స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులు, పరికరాలకు ఉన్న డిమాండ్‌ను తీర్చే చర్యలు కావాలని చెప్పారు.

Next Story

Most Viewed