RRBs: మే 1 నుంచి 'ఒకే రాష్ట్రం-ఒకే ఆర్ఆర్‌బీ'

by S Gopi |   (  Updated:2025-04-08 15:35:35  IST  )

తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 43 ఆర్ఆర్‌బీలను 28కి తగ్గించనున్నారు.

RRBs: మే 1 నుంచి ఒకే రాష్ట్రం-ఒకే ఆర్ఆర్‌బీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఖర్చుల హేతుబద్దీకరణ కోసం దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)లను కేంద్రం విలీనం చేయనుంది. ఈ మేరకు మే 1 నుంచి 'ఒకే రాష్ట్రం-ఒకే ఆర్ఆర్‌బీ'ని అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 43 ఆర్ఆర్‌బీలను 28కి తగ్గించనున్నారు. విలీనం అయ్యే ఆర్ఆర్‌బీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాలుగింటితో పాటు ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన మూడు, బీహార్, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లకు చెందిన రెండు చొప్పున ప్రాంతీయ బ్యాంకులున్నాయి.

తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) ఆస్తులు, అప్పులను ఏపీజీవీబీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ల మధ్య విభజించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటిని కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఎస్‌బీఐ స్పాన్సర్డ్ బ్యాంకులుగా ఉన్నాయి. విలీన ప్రక్రియ తర్వాత వీటిని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కింద సేవలందించనున్నాయి. యూనియన్ బ్యాంక్ దీనికి స్పాన్సర్డ్‌గా ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో ఒక్కో రాష్ట్రంలో ఒకే ఆర్ఆర్‌బీ ఉంటుంది.

కేంద్రం 2004 నుంచి ఆర్ఆర్‌బీల ఏకీకరణ ప్రక్రియను కొనసాగిస్తోంది. అప్పటివరకు దేశవ్యాప్తంగా 196 గ్రామీణ బ్యాంకులు కార్యకలాపాలు సాగిస్తుండేవి. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారికి రుణాలు, ఇతర సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో ఆర్ఆర్‌బీ చట్టం, 1976 కింద ఏర్పడ్డాయి. 2020-21 నాటికి వీటిని 43కి తగ్గించారు. సాధారణంగా ఆర్ఆర్‌బీల్లో కేంద్రానికి 50 శాతం వాటా ఉంటుంది. మిగిలిన దాంట్లో 35 శాతం స్పాన్సర్డ్ బ్యాంకు, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.

Next Story