ప్రధానీ మోడీని పొగడ్తలతో ముంచెత్తిన రిలయన్స్ అధినేత

by Dishanational1 |
ప్రధానీ మోడీని పొగడ్తలతో ముంచెత్తిన రిలయన్స్ అధినేత
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీ 20 ఏళ్ల దార్శనికతకు 'వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్' నిదర్శనమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ అన్నారు. మోడీ దేశ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ప్రధాని అంటూ ప్రశంసించారు. గాంధీనగర్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖేష్ అంబానీ, 'రెండు దశాబ్దాల క్రితం మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఇన్వెస్టర్ సమ్మిట్‌గా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆయన మాటను ప్రపంచం మొత్తం వినడమే కాకుండా దేశాన్నే ప్రశంసించే స్థాయికి తీసుకెళ్లారు. భారత ప్రధాని పట్టుదల, సంకల్పంతో అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తున్నారని, విదేశాల్లో వారు కొత్త ఇండియా అంటే గుజరాత్‌నే ఊహించుకుంటున్నారు. ఇదంతా మోడీ వల్లనే సాధ్యమైందని' ముఖేష్ అంబానీ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని హజిరాలో భారత్‌లోనే మొదటి ప్రపంచస్థాయి కార్బన్ ఫైబర్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్టు అంబానీ వెల్లడించారు. జాంనగర్‌లో 500 ఎకరాల్లో ధీరుభాయి అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. దీనివల్ల గ్రీన్ ఎనర్జీ రంగంలో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. గుజరాత్‌ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులకు ఎగుమతి కేంద్రంగా మారనుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో కాంప్లెక్స్ ప్రారంభమవుతుందని అంబానీ తెలిపారు. ఇదే సమయంలో 2047 నాటికి భారత 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందన్నారు. అంతేకాకుండా ఒక్క గుజరాత్ మాత్రమే 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా నిలవనుందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.


Next Story

Most Viewed