బీజింగ్‌ను వెనక్కి నెట్టి ఆసియా కుబేరుల రాజధానిగా అవతరించిన ముంబై

by Disha Web Desk 17 |
బీజింగ్‌ను వెనక్కి నెట్టి ఆసియా కుబేరుల రాజధానిగా అవతరించిన ముంబై
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వాణిజ్య రాజధాని ముంబై మరో కీలక మైలురాయికి చేరుకుంది. ఆసియాలో అత్యధిక మంది ధనవంతులు నివాసముంటున్న జాబితాలో బీజింగ్‌ను దాటి ముంబై మొదటి స్థానంలో నిలిచింది. 2024 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం, 92 మంది బిలియనీర్లతో ముంబై తొలిసారి ఆసియా బిలియనీర్ రాజధానిగా అవతరించింది. అదే, బీజింగ్ ఈ జాబితాలో 91 మంది బిలియనీర్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచ నగరాల పరంగా చూసినట్లయితే 119 మందితో న్యూయార్క్ మొదటి స్థానంలో ఉండగా, 97 మందితో రెండో లండన్ స్థానంలో, ముంబై మూడో స్థానంలో ఉంది. న్యూఢిల్లీ మొదటిసారిగా టాప్ 10లోకి ప్రవేశించింది.

అదే దేశాల పరంగా అయితే చైనాలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు (814) ఉండగా, తర్వాతి స్థానంలో అమెరికా(800), భారత్ 271 మంది బిలియనీర్లతో మూడో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య స్వల్పంగా 5 శాతం పెరిగింది. గత ఏడాది కంటే ఈ సారి అమెరికా 109 మంది కొత్త బిలియనీర్‌లను జోడించగా, తరువాత భారత్ 94 మందిని జత చేసింది.

నివేదిక ప్రకారం, ముంబై 27 మంది కొత్త బిలియనీర్‌లను చేర్చుకుంది. ముంబై మొత్తం సంపద 47 శాతం పెరిగింది, అదే బీజింగ్ 28 శాతం క్షీణతను నమోదు చేసింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో మొదటి పది మందిలో ఎనిమిది మంది అమెరికాకు చెందినవారు. ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. అదే ప్రపంచవ్యాప్తంగా పదవ స్థానంలో నిలిచారు. సంపదలో 62 శాతం పెరుగుదలతో గౌతమ్ అదానీ ఈ జాబితాలో 15వ స్థానంలో నిలిచాడు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 167 మంది కొత్త బిలియనీర్లు చేరారు, దీంతో మొత్తం 3279కి చేరుకుంది.


Next Story

Most Viewed