- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
IMF: ఐఎంఎఫ్ రుణమిచ్చినా పాక్కు కష్టాలే

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ను రెచ్చగొట్టి తగువుకు దిగి, మరోవైపు లేనిపోని అబద్దాలతో అంతర్జాతీయ సమాజం ముందు బీద అరుపులు అరుస్తున్న పాకిస్తాన్ భవిష్యత్తులో మరింత పతనం దిశగా పయనిస్తోంది. ఇప్పటికే రోజువారీ అప్పుల మీద పాలనను కొనసాగిస్తున్న పాక్ ప్రభుత్వం, ఎంతకాలం ఇలా కొనసాగలదనే అభిప్రాయం విశ్లేషకుల్లో వినిపిస్తోంది. 2023 నుంచి అత్యల్పంగా 3 శాతం తక్కువ వృద్ధి, రికార్డు స్థాయిలో పెరిగిన ద్రవ్యోల్బణం, ప్రకృతి వైపరీత్యాలతో, అనేక రంగాలు దెబ్బతిని బలహీనపడిన పాకిస్తాన్ గతేడాది నుంచే కొంత కోలుకునే దిశగా కనిపించింది. అష్టకష్టాలు పడి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) నుంచి బెయిలౌట్ ప్యాకేజీతో బతుకీడుస్తోంది. 2024, డిసెంబర్ నాటికి ఐఎంఎఫ్ ప్యాకేజీ కాకుండా బయటి రుణాలు అంటే పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి పాకిస్తాన్కు 131 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో సుమారు రూ. 11.42 లక్షల కోట్ల) అప్పు ఉంది.
2022, జూలై నాటికి 0.2 శాతం శాతం వృద్ధితో దెబ్బతిన్న పాకిస్తాన్, ఆ తర్వాత 2023 నాటికి రికవరీ వైపు సాగింది. 2023-24లో పాక్ ఆర్థికవ్యవస్థ 2.5 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. 2024-25 నాటికి 2.7 శాతం వృద్ధి చెందగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అలాగే, 2023 ద్వితీయార్థం నాటికి రికార్డు స్థాయిలో 40 శాతం ద్రవ్యోల్బణాన్ని చూసిన పాకిస్తాన్, 2025, మార్చి నాటికి 0.7 శాతం, ఈ ఏడాది ఏప్రిల్లో 0.3 శాతానికి తగ్గించగలిగింది. ఈ కారణంగానే గతేడాది ద్వితీయార్థంలో ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్ల దీర్ఘకాలిక రుణం కోసం ఆమోదం పొందగలిగింది. దీనికోసం ఐఎంఎఫ్ విధించిన అన్ని షరతులకు తలూపింది. తమ దేశంలోని లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా కోత విధించేందుకు సిద్ధమైంది.
ఐఎంఎఫ్ బెయిలౌట్
శుక్రవారం(మే 9న), ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించిన ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) నుంచి పాకిస్తాన్కు దాదాపు 1 బిలియన్ డాలర్ల తక్షణ రుణం లభించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశానికి రుణమివ్వడం అందుకు సహకరించడమేనని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ చరిత్ర, తీరును గమణించిన ఆర్థికవేత్తలు ఐఎంఎఫ్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరోవైపు, ఐఎంఎఫ్ రుణం ద్వారా పాకిస్తాన్లో వినియోగదారుల డిమాండ్, వ్యాపార విశ్వాసం మెరుగుపడుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఇన్నేళ్లలో దేశాన్ని గాడిన పెట్టడంలో విఫలమైన పాక్ పాలకులు ఈ ఐఎంఎఫ్ రుణం ద్వారా మాత్రం ఎంతమేరకు బాగుపడేందుకు ఆలోచించగలరనే ప్రతికూల అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
అయినా కష్టాలే
గతేడాది ద్వితీయార్థం తర్వాత ఐఎంఎఫ్ ప్యాకేజీ ఆమోదం లభించడం, తాజా 1 బిలియన్ డాలర్ల రుణం అందుకోవడంతో పాక్కు ఆర్థిక వెసులుబాటు లభించినట్టు అయింది. కానీ, ఇప్పుడిప్పుడే రికవరీ చూస్తున్న పాకిస్తాన్ భారత్పై ఉగ్రవాద దాడిని ప్రోత్సహించి, అనంతరం భారత్ను రెచ్చగొట్టి యుద్ధానికి కాలు దువ్వడం వల్ల కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అయింది. ఏ సందర్భంలోనైనా శాంతి కోరుకునే భారత్ తగువుకు దిగి పాకిస్తాన్ మరోసారి భంగపాటుకు గురైందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ సమయంలో ఐఎంఎఫ్ రుణం లభించినప్పటికీ పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ పూర్తిగా గాడిన పడేందుకు చాలా కాలం పడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతర్గత రాజకీయ ఒత్తిడితో పాలన కొనసాగడం పాకిస్తాన్కు కీలకమైన మరో ప్రమాదం అని విశ్లేషకులు తెలిపారు. తగినంత విదేశీ మారక నిల్వలు లేకుండా బాహ్య రుణాలపై ఆధారపడటం మరింత ఆందోళన కలిగించే అంశం.