ఎంజీ మోటార్, బీవైడీ ఇండియాతో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చర్చలు!

by Disha Web Desk 10 |
ఎంజీ మోటార్, బీవైడీ ఇండియాతో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చర్చలు!
X

న్యూఢిల్లీ: సజ్జన్‌ జిందాల్‌ నేతృత్వంలోని ప్రముఖ వ్యాపార సంస్థ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ వాహన తయారీ రంగంలోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకోసం ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియాతో చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనాకు చెందిన బీవైడీ ఇండియా కంపెనీలో సైతం వాటా కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఇతర రంగాలకు కూడా విస్తరించాలనే లక్ష్యంతో ఉందని కంపెనీ చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ శేషగిరిరావు చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈవీల తయారీలోకి ప్రవేశించే ఆసక్తి ఉన్నట్టు చెప్పారు. ముందుగా కార్ల తయారీలోకి ప్రవేశించాలని కంపెనీ భావిస్తోందని, ప్రస్తుతం దీనిపై సంస్థలో అంతర్గత చర్చలు జరుగుతున్నట్టు ఆయన తెలిపారు. తాజాగా, వాటా కోనుగోలు ప్రక్రియపై ఎంజీ మోటార్ ఇండియా, బీవైడీ ఇండియాలతో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చర్చలు జరుపుతోందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ అంశంపై అధికారికంగా ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Also Read..

ఒడిదుడుకులు కానీ చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టిన మార్కెట్లు!



Next Story

Most Viewed