మహిళలకు పెరుగుతున్న ఉద్యోగావకాశాలు

by Dishanational1 |
మహిళలకు పెరుగుతున్న ఉద్యోగావకాశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా మహిళలకు ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఫ్రీలాన్స్ పద్దతిలో ఉద్యోగం చేస్తున్న మహిళల సంఖ్య గడించిన ఏడాది కాలంలో భారీగా పెరిగిందని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ టాలెంట్ ప్లాట్‌ఫామ్ ఫౌండ్ఇట్ డేటా ప్రకారం, గతేడాది కంటే 2024, ఫిబ్రవరిలో మహిళలకు ఉద్యోగావకాశాలు 56 శాతం పెరిగాయి. అంతేకాకుండా ఫ్రీలాన్స్ ఉద్యోగాలను ఎంచుకుంటున్న మహిళలు కూడా గతేడాది కంటే రెండింతలు పెరిగి 8 శాతానికి చేరారు. మిగిలిన రంగాలతో పోలిస్తే 36 శాతం ఉద్యోగులతో మహిళలకు ఎక్కువ అవకాశాలను ఐటీ రంగం అందిస్తోంది. ఇది ఈ రంగంలో మారుతున్న పనివిధానం, అందరికీ సమానావకాశాలు లభిస్తున్న ధోరణిని సూచిస్తుందని ఫౌండ్ఇట్ అభిప్రాయపడింది. ఐటీ తర్వాత రిక్రూట్‌మెంట్ రంగమో 24 శాతం అవకాశాలను అందిపుచ్చుకున్నారు. అనంతరం బీఎఫ్ఎస్ఐ రంగంలో 23 శాతం మహిళలు ఉన్నారు. భారీ యంత్రాలతో పని కారణంతో ఇంజనీరింగ్, ఉత్పత్తి విభాగాల్లో మహిళలకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ ఈ రంగంలో మహిళా ఉద్యోగుల సంఖ్య ఆరు రెంట్లు పెరిగింది. ఇందులో అత్యధికంగా ఈవీ, ఆటోమొబైల్ పరిశ్రమలో అవకాశాలు లభించినట్టు తెలుస్తోంది.

కొన్ని రకాల ఉద్యోగాల కోసం మహిళలను తీసుకునేందుకు వీలుగా కంపెనీలు అవకాశాలను కల్పిస్తున్నాయి. అందులో ఐటీ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు 25 శాతం, హెచ్ఆర్(18 శాతం), సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్(12 శాతం, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్(10 శాతం) వంటి ఉద్యోగాల్లో మహిళలు పెరిగారు. ఇదే సమయంలో కస్టమర్ సర్వీస్, బీపీఓల నియామకాల్లో మహిళలకు అవకాశాలు 10 శాతం తగ్గాయి. మారుతున్న మార్కెట్ డిమాండ్, ఆటోమేషన్‌కు అనుగుణంగా కంపెనీలు అవసరమైన ఎక్కువమంది మహిళా ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.

హైదరాబాద్, బెంగళూరు టాప్..

ఫౌండ్ఇట్ డేటా ప్రకారం, ఢిల్ల్-ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణె వంటి మెట్రో నగరాల్లో మహిళా ఉద్యోగులకు అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇది కుటుంబం కోసం అదనపు ఆదాయం సమకూర్చుకోవాలనుకునే ప్రస్తుత తరం ఆలోచనా ధోరణిని సూచిస్తుందని ఫౌండ్ఇట్ అభిప్రాయపడింది.

'ఒక కంపెనీ విజయంలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంటుంది. వారి శ్రమ, సృజనాత్మకత మెరుగ్గా ఉంటుంది. తమ కంపెనీలోనూ 35 శాతం మేర మహిళా ఉద్యోగులు ఉన్నారు. రాబోయే సంవత్సరాల్లో దీన్ని మరింత పెంచే చర్యలు తీసుకుంటున్నాం' అని ఫౌడ్ఇట్ సీఈఓ శేఖర్ గరిసా పేర్కొన్నారు.


Next Story

Most Viewed