ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 23 శాతం వృద్ధి!

by Disha Web Desk 16 |
ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 23 శాతం వృద్ధి!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ మధ్యవరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 7,00,669 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన రూ. 5,68,147 కోట్లతో పోలిస్తే ఈసారి 23 శాతం వృద్ధి చెందాయి. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ, ప్రభుత్వ విధానాలతోనే ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినడంతో వసూళ్లు తగ్గాయి.

మొత్తం వసూళ్లలో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు(సెక్యూరిటీ లావాదేవీ పన్నుతో కలిపి) రూ. 3.30 లక్షల కోట్లు, కార్పొరేట్ పన్ను వసూళ్లు 3.68 లక్షల కోట్లుగా ఉన్నాయి. సమీక్షించిన కాలానికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు(వాపసుల కోసం సర్దుబాటుకు ముందు) రూ. 8.36 లక్షల కోట్లుగా ఉన్నాయి. అలాగే, 2022-23 రెండు త్రైమాసికాల్లో ముందస్తు పన్ను వసూళ్లు సెప్టెంబర్ 17 నాటికి రూ. 2.95 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన దానికంటే 17 శాతం పెరిగాయి. మొత్తం ముందస్తు పన్ను వసూళ్లలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ. 2.29 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ. 66,176 కోట్లుగా నమోదైనట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.

Next Story