ఈ ఏడాది ప్రపంచ వృద్ధిలో 15 శాతం వాటా భారత్‌దే: ఐఎంఎఫ్!

by Disha Web Desk 17 |
ఈ ఏడాది ప్రపంచ వృద్ధిలో 15 శాతం వాటా భారత్‌దే: ఐఎంఎఫ్!
X

న్యూఢిల్లీ: 2023లో ప్రపంచ వృద్ధికి భారత్ 15 శాతం మేర సహకారం అందించనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్‌, చైనాదేనని ఐఎంఎఫ్ వెల్లడించింది. అందులో 15 శాతం భారత్ సహకారం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ మంగళవారం జరిగిన దక్షిణాసియా దేశాల సమావేశంలో చెప్పారు.

ఇదే సమయంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి రేటు 6.1 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇది ఆర్‌బీఐ అంచనా వేసిన 6.4 శాతం కంటే తక్కువ. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల కంటే వృద్ధిలో భారత్ మెరుగ్గానే ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం కీలక సవాలుగా ఉందని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ పరిస్థితుల మధ్య వడ్డీ రేట్లను కఠినతరం చేయాల్సి ఉంటుంది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థల మందగమనం వంటి బలహీన పరిస్థితుల మధ్య దేశీయ డిమాండ్‌ ఎలా ప్రభావితమవుతుందనేది భారత్‌కు కీలకమైన సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు.

కాగా, ఇటీవల ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు మరోసారి కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. గతేడాది నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 2.5 శాతం పెంచింది. అయినప్పటికీ గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం కంటే ఎగువన 6.52 శాతంగా నమోదైంది.



Next Story

Most Viewed