ప్రీమియం ఈవీ బైకుల తయారీ కోసం జీరోతో జతకట్టిన హీరో మోటోకార్ప్!

by Disha Web Desk 7 |
ప్రీమియం ఈవీ బైకుల తయారీ కోసం జీరోతో జతకట్టిన హీరో మోటోకార్ప్!
X

న్యూఢిల్లీ: ప్రీమియం ఎలక్ట్రిక్ బైకుల తయారీ కోసం అమెరికాకు చెందిన జీరో మోటార్‌సైకిల్స్‌తో దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఒప్పందం చేసుకుంది. ఇటీవల అత్యంత వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) డిమాండ్‌ను తీర్చేందుకు గానూ ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటనలో వెల్లడించింది. ఇరు సంస్థలూ కలిసి ప్రీమియం ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయనున్నాయి. ఈవీ బైకుల తయారీలో నైపుణ్యం కలిగిన జీరో కంపెనీ సహకారంతో హీరో దేశీయంగా ఈవీ మోటార్‌సైకిళ్ల అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ నిర్వహించనుంది.

గతేడాది సెప్టెంబర్‌లో జీరో కంపెనీలో హీరో సుమారు రూ. 490 కోట్ల వరకు ఈక్విటీ రూపంలో పెట్టుబడి పెట్టింది. తాజా భాగస్వామ్యంతో ఈవీ ద్విచక్ర వాహనాల విభాగంలో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా ఉంటుందని హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్ అన్నారు. ముఖ్యంగా దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా ఈవీ విభాగంలో వేగవంతమైన వృద్ధికి ఇది సహకరిస్తుందని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీ బ్రాండ్ అయిన హీరోతో కలవడం సంతోషంగా ఉందని జీరో మోటార్‌సైకిల్స్ సీఈఓ సామ్ పాషెల్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed