ఉద్యోగులకు రూ. 1,500 కోట్ల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

by Dishanational1 |
ఉద్యోగులకు రూ. 1,500 కోట్ల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగులకు భారీ ఆఫర్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంకు అద్భుతమైన పనితీరు కనబర్చిన నేపథ్యంలో బ్యాంకు తన సిబ్బందికి సుమారు రూ. 1,500 కోట్ల ఎక్స్-గ్రేషియా ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీతో విలీన సమయంలో ఉద్యోగుల అంకితభావానికి ప్రశంసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ చెప్పారు. విలీనానికి ముందు, తర్వాత సంస్థ బ్యాలెన్స్ షీట్ విషయంలో ఉద్యోగులు ఎంతో కష్టపడ్డారు. కొత్త నిబంధనలకు సర్దుబాటు కావడంలో ఉద్యోగులు వేగంగా స్పందించారు. క్షేత్రస్థాయి నుంచి ఉద్యోగులు అన్ని రకాలుగా కష్టపడ్డారని ఆయన పేర్కొన్నారు. గత రెండేళ్లలో మేము అధిక అట్రిషన్‌ను చూశాము. అయినప్పటికీ 90 శాతం ఉద్యోగులను ప్రోత్సహిస్తూ, విలీనం, తర్వాతి పరిణామాల్లో మెరుగైన ఫలితాలను సాధించామని జగదీషన్ వివరించారు. కాగా, గతవారాంతం జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన బ్యాంకు నికర లాభం 37.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రధానంగా బ్యాంకు తన ఎడ్యుకేషన్ లోన్ విభాగం హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలాలో మెజారిటీ వాటా విక్రయినచడం ద్వారా అత్యధిక లాభాలను సాధించింది. దీంతో బ్యాంకు వద్ద రూ. 10,900 కోట్ల అదనపు నిధులను కేటాయించింది.



Next Story

Most Viewed