ఇక ఆటోమెటిక్‌గా బ్యాంక్ అకౌంట్లలోకి పీఎఫ్.. కీలక నిర్ణయం తీసుకోనున్న EPFO?

by Naga Rani Yarlagadda |

పీఎఫ్ క్లైయిమ్ చేయని ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా ఆ మొత్తాన్ని ఆటోమెటిక్ గా జమచేసేందుకు ఈపీఎఫ్ఐ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

ఇక ఆటోమెటిక్‌గా బ్యాంక్ అకౌంట్లలోకి పీఎఫ్.. కీలక నిర్ణయం తీసుకోనున్న EPFO?
X

దిశ, వెబ్ డెస్క్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన ఖాతాదారులకు పెద్ద ఉపశమనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేయకుండా ఇన్‌యాక్టివ్ (Inactive) అకౌంట్లలో పేరుకుపోయిన నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసేందుకు 'ఆటోమేటెడ్ సెటిల్‌మెంట్ సిస్టమ్'ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఈ ఆలోచన ఆచరణలోకి వస్తే.. చందాదారులు ఎటువంటి దరఖాస్తులు చేయకుండానే వారి ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు చేరుతుంది.

తొలి విడతలో 8 లక్షల ఖాతాలు

మొదటి దశలో ఆధార్ ధృవీకరణ పూర్తయిన సుమారు 8 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాలను అధికారులు ప్రాసెస్ చేయనున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 5,200 కోట్లు ఉండవచ్చని అంచనా. మొత్తం 31 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాల్లో రూ.10,181 కోట్లు పేరుకుపోగా, అందులో 25 శాతం ఖాతాలను ఇప్పుడు సెటిల్ చేయనున్నారు. దాదాపు 14,000 ఖాతాల్లో రూ.5 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. రూ.1,000 లోపు బ్యాలెన్స్ ఉన్న ఇన్‌యాక్టివ్ ఖాతాలను ఆటోమేటిక్‌గా సెటిల్ చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. తాజా ప్రతిపాదన దీనికి కొనసాగింపు అవుతుందని భావిస్తున్నారు. కాగా.. ఆటోమెటిక్ పీఎఫ్ సెటిల్మెంట్ పై ఈపీఎఫ్ నుంచి అధికారిక ప్రకటన రావలసి ఉంది.

ఖాతా ఎప్పుడు ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది?

సాధారణంగా ఒక ఉద్యోగి 55 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన తర్వాత, వరుసగా మూడేళ్ల పాటు ఎటువంటి కంట్రిబ్యూషన్లు లేకపోతే ఆ ఖాతా ఇన్‌యాక్టివ్ గా మారుతుంది. 55 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి 58 ఏళ్లు వచ్చే వరకు వడ్డీ జమ అవుతుంది. అయితే.. 36 నెలల పాటు లావాదేవీలు లేని ఖాతాలను డార్మెంట్ (Dormant) గా పరిగణించి, ఆ తర్వాత వడ్డీని నిలిపివేస్తారు. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం.. సుమారు 7 లక్షల ఖాతాలు గత 20 ఏళ్లుగా ఎటువంటి క్లెయిమ్ లేకుండా అలాగే ఉన్నాయి. కొత్త విధానం అందుబాటులోకి వస్తే లక్షలాది మంది కార్మికులకు మేలు జరగనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ డిపాజిట్లపై ప్రభుత్వం 8.25 శాతం వడ్డీని ఖరారు చేసింది. వరుసగా రెండో ఏడాది కూడా ఇదే రేటును కొనసాగిస్తున్నారు.

Next Story