ఈ ఏడాది దేశంలోని మొత్తం స్కూటర్ల అమ్మకాల్లో 5 శాతం ఈవీలదే: గ్రీవ్స్ ఎలక్ట్రిక్!

by Disha Web Desk 7 |
ఈ ఏడాది దేశంలోని మొత్తం స్కూటర్ల అమ్మకాల్లో 5 శాతం ఈవీలదే: గ్రీవ్స్ ఎలక్ట్రిక్!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ మొత్తం స్కూటర్ మార్కెట్లో ఈ-స్కూటర్ల వాటా 5 శాతానికి చేరుకుంటుందని ప్రముఖ యాంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 2 శాతంగా ఉందని కంపెనీ తెలిపింది. 2022-23లో పరిశ్రమ మొత్తం 7 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు సాధిస్తుందనే అంచనాలున్నాయని, ఇది గతేడాది కంటే 180 శాతం వృద్ధి కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) పట్ల వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని కంపెనీ అభిప్రాయపడింది.

ఇదే స్థాయిలో అమ్మకాలు కొనసాగితే 2027 నాటికి 30-35 శాతం ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌(ఐసీఈ) స్కూటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్లకు మారతాయని కంపెనీ అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఈవీల అమ్మకాల్లో యాంపియర్ 14-15 శాతం వాటా కలిగి ఉంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 65 వేల ఈవీలను విక్రయించగా, ప్రస్తుతం 2022-23 మొదటి త్రైమాసికంలోనే 29,577 యూనిట్లను విక్రయించింది. దీంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 25 వేల యూనిట్లకు రెట్టింపు చేయాలని కంపెనీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో దేశంలోని పలు చోట్ల ఈవీలు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనల వల్ల అమ్మకాలు కొంత మందిగించినప్పటికీ, గత రెండు మూడు త్రైమాసికాల్లో ఎదురైన చిప్‌ల కొరత తీరిందని, రానున్న నెలల్లో విక్రయాలు మరింత వేగవంతంగా ఉంటాయని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed