తగ్గిపోతున్న డీమ్యాట్ ఖాతాలు!

by Disha Web Desk 17 |
తగ్గిపోతున్న డీమ్యాట్ ఖాతాలు!
X

ముంబై: భారత స్టాక్ మార్కెట్లలో మదుపునకు అవసరమైన డీమ్యాట్ ఖాతాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. 2020 కరోనా మహమ్మారి తర్వాత స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు రికార్డు స్థాయిలో పెరిగారు. ముఖ్యంగా చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంతో ఇతర పెట్టుబడి మార్గాలను వెతకడం, అదే సమయంలో అనేక స్టార్టప్‌లు ఐపీఓలకు రావడంతో డీమ్యాట్ ఖాతాలు గణనీయంగా పెరిగాయి. అయితే, మూడేళ్ల తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రస్తుతం కొత్తగా డీమ్యాట్ ఖాతాలను తెరిచే వారి సంఖ్య 2020, డిసెంబర్ స్థాయికి పడిపోయింది.

కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు మొగ్గు చూపారు. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ల గురించి సరైన అవగాహన లేనివారు సైతం ఎడాపెడా మదుపు చేయడం ప్రారంభించారు. 2020, డిసెంబర్ సమయంలో కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరిచే వారి సంఖ్య 10 లక్షలు ఉండగా, 2021, అక్టోబర్‌లో అత్యధికంగా 35 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరిచారు.

అయితే ప్రస్తుతం కొన్ని నెలల నుంచి డీమ్యాట్ ఖాతాలు తెరిచే వారి సంఖ్య పడిపోవడంతో ఏప్రిల్‌లో 16 లక్షలకు తగ్గింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం తగ్గిపోవడం, కొన్నాళ్ల నుంచి ఐటీ సెక్టార్‌ తీవ్ర ఒత్తిడిలో ఉండటం, ఇటీవల ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారడం కూడా డీమ్యాట్ ఖాతాల పతనానికి కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.


Next Story