మెజారిటీ వాటా విక్రయానికి సిద్ధమైన ఎంజీ మోటార్ ఇండియా!

by Disha Web Desk 17 |
మెజారిటీ వాటా విక్రయానికి సిద్ధమైన ఎంజీ మోటార్ ఇండియా!
X

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా కంపెనీలోని మెజారిటీ వాటాను విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానికోసం దేశీయంగా వాటాను కొనేవారి కోసం ప్రయత్నాలు చేస్తోంది. భారత మార్కెట్లో 2028 నాటికి కార్యకలాపాలను విస్తరించడం కోసం రూ. 5,000 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే వాటా విక్రయానికి చూస్తోంది.

ఇప్పటికే ఎంజీ మోటార్ ఇండియాలో వాటా కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, హీరో గ్రూప్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వంటి సంస్థలు పోటీ పడుతున్నట్టు సమాచారం. అయితే వాటా విక్రయానికి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, ఈ ఏడాది ఆఖరు నాటికి ఒప్పందం పూర్తవనున్నట్టు కంపెనీ ఆశిస్తోంది.

ఎంజీ మోటార్ ఇండియా మాతృసంస్థ చైనాకు చెందిన ఎంజీ మోటార్ మూలధన నిధులను సేకరించడంలో సమస్యలను ఎదుర్కొంటోంది. భారత్-చైనా మధ్య నెలకొన్న సమస్యల కారణంగా భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మెజారిటీ వాటా విక్రయానికి సిద్ధమైంది.

Next Story