Airtel: 7,100 కోట్ల స్పామ్ కాల్స్‌ను కట్టడి చేసిన ఎయిర్‌టెల్ 'ఏఐ స్పామ్ ఫిల్టర్'

by S Gopi |

తన నెట్‌వర్క్ పరిధిలో వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్‌లలో 8 లక్షల కంటే ఎక్కువ మోసపూరిత లింక్‌లను ఎయిర్‌టెల్‌ బ్లాక్ చేసింది.

Airtel: 7,100 కోట్ల స్పామ్ కాల్స్‌ను కట్టడి చేసిన ఎయిర్‌టెల్ ఏఐ స్పామ్ ఫిల్టర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్పామ్‌ కాల్స్‌ను నిలువరించేందుకు ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా 2024లో సబ్‌స్క్రైబర్ల కోసం కృత్రిమ మేధా (ఏఐ) ఆధారిత సొల్యూషన్‌ స్పామ్ ఫిల్టర్‌ను ప్రారంభించినప్పటి నుంచి కోట్లాది కాల్స్, మెసేజ్‌లను గుర్తించినట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి మొత్తం 71 బిలియన్స్(7,100 కోట్ల)కు పైగా కాల్స్, 290 కోట్లకు పైగా మెసేజ్‌లను స్పామ్‌గా గుర్తించామని పేర్కొంది. ముఖ్యంగా తన నెట్‌వర్క్ పరిధిలో వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్‌లలో 8 లక్షల కంటే ఎక్కువ మోసపూరిత లింక్‌లను బ్లాక్ చేసింది. ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే స్కామ్‌లను కట్టడి చేయడంలో ఎయిర్‌టెల్ మెరుగ్గా ఉందని కంపెనీ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ చెప్పారు. ఇతర నెట్‌వర్క్‌లలోని కస్టమర్లతో పోలిస్తే ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు 70 శాతం తక్కువ స్కామ్‌లను ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. స్కామ్‌లు ఇప్పుడు చాలా పెద్ద వ్యాపారంగా మారాయని రాహుల్ వాట్స్ అన్నారు. గతంలో, స్కామ్‌లు ఎక్కువగా సాధారణ ఈ-మెయిల్స్ ద్వారా జరిగేవి. కానీ ఇప్పుడు, స్కామర్లు తరచుగా విదేశాల్లో ఉండే హైటెక్ కాల్ సెంటర్ల నుంచి పని చేస్తున్నారు. ప్రజలను మోసగించడానికి స్మార్ట్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు(దీన్నే సోషల్ ఇంజనీరింగ్ అంటారు). ప్రపంచవ్యాప్తంగా, స్కామ్‌ల కారణంగా ప్రజలు సుమారు 1.03 ట్రిలియన్ డాలర్ల(రూ. 93.27 లక్షల కోట్ల)ను కోల్పోతున్నారు. స్పామ్, స్కామ్ కాల్స్‌ను గుర్తించడానికి, నిరోధించడానికి ఎయిర్‌టెల్ ఏఐ వ్యవస్థ 250 కంటే ఎక్కువ విభిన్న సైన్స్, ప్యాటర్న్స్‌ను తనిఖీ చేస్తుందని రాహుల్ వాట్స్ పేర్కొన్నారు.

Next Story