Airtel: 'స్లైసింగ్' టెక్నాలజీతో 'ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్' ప్లాన్స్ ప్రారంభించిన ఎయిర్‌టెల్

by S Gopi |

దీని ద్వారా కంపెనీ తన నెట్‌వర్క్‌ను విభజించి, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ప్రయారిటీ సేవలు అందిస్తుంది.

Airtel: స్లైసింగ్ టెక్నాలజీతో ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ప్రారంభించిన ఎయిర్‌టెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం 'ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్' పేరుతో కొత్త 5జీ సేవలను ప్రారంభించింది. ఈ సేవల ద్వారా నెట్‌వర్క్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో కూడా వినియోగదారులకు నిరంతరాయ కనెక్టివిటీ లభిస్తుంది. ముఖ్యంగా ఆఫీస్ కాల్స్, వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ మీటింగ్స్, క్యాబ్ బుకింగ్ వంటి సేవలను ఎక్కువగా ఉపయోగించే ప్రీమియం కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను తీసుకొచ్చినట్టు ఎయిర్‌టెల్ వెల్లడించింది.

దీనికోసం ఎయిర్‌టెల్ 5జీ 'నెట్‌వర్క్ స్లైసింగ్' అనే కొత్త టెక్నాలజీని లాంచ్ చేసింది. దీని ద్వారా కంపెనీ తన నెట్‌వర్క్‌ను విభజించి, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ప్రయారిటీ సేవలు అందిస్తుంది. అధిక నెట్‌వర్క్ డిమాండ్ ఉన్న సమయం, ప్రాంతాల్లో కాల్ డ్రాప్స్ తగ్గడం, డేటా స్పీడ్ స్థిరంగా ఉండడం, కనెక్టివిటీ మరింత నమ్మకంగా ఉండడం సాధ్యమవుతుందని కంపెనీ చెబుతోంది. దీంతో దేశంలో ఇలాంటి స్లైసింగ్ ఆధారిత 5జీ సేవలను ప్రారంభించిన తొలి టెలికాం సంస్థగా ఎయిర్‌టెల్ నిలిచింది. అమెరికా, యూకే, సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో ఇప్పటికే ఈ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్‌పెయిడ్‌ సేవలు వాడుతున్న యూజర్లకు ఆటోమేటిక్‌గా ఈ సేవలు లభిస్తాయని, కొత్తగా ఈ సేవలు పొందడానికి ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ లేదా ఎయిర్‌టెల్‌ స్టోర్‌లను సందర్శించాలని కంపెనీ సూచించింది. ఈ ప్రయారిటీ సేవల ప్లాన్‌లు రూ.449 నుంచి రూ.1,749 ఫ్యామిలీ ప్లాన్ వరకు వివిధ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్, యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Next Story