AI: హెల్త్‌కేర్‌లో ఏఐ వినియోగం ద్వారా దేశ జీడీపీకి భారీ ఆదాయం

by S Gopi |

ఇండియా ఏఐ మిషన్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్-2023 వంటి ప్రభుత్వం కార్యక్రమాలు ఇందుకు దోహదపడుతున్నాయి.

AI: హెల్త్‌కేర్‌లో ఏఐ వినియోగం ద్వారా దేశ జీడీపీకి భారీ ఆదాయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావంతో హెల్త్‌కేర్‌లో ఏఐ వాటా క్రమంగా పుంజుకుంటోంది. డెలాయిట్ తాజాగా రూపొందించిన నివేదిక ప్రకారం, 2025 నాటికి హెల్త్‌కేర్ రంగంలో ఏఐ కారణంగా భారత జీడీపీకి 25-30 బిలియన్ డాలర్ల(రూ. 2.62 లక్షల కోట్ల) సహకారం అందించనుంది. ప్రధానంగా ఇండియా ఏఐ మిషన్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్-2023 వంటి ప్రభుత్వం కార్యక్రమాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఫలితంగా బాధ్యతాయుతమైన ఏఐ వినియోగం, మెరుగైన డేటా భద్రత ద్వారా హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్‌ సమర్థవంతంగా కొనసాగుతోంది.

నివేదిక వివరాల ప్రకారం, ప్రస్తుతం హెల్త్‌కేర్ రంగంలో ఏఐ వినియోగం 40 శాతానికి పైగా పెరిగింది. మిగిలిన రంగాల్లో ఎఫ్ఎంసీజీలో 30 శాతం, తయారీ రంగంలో 25 శాతానికి చేరింది. ఏఐ పవర్డ్ డయాగ్నస్టిక్స్, మెడ్‌టెక్ ఇన్నోవేషన్స్, డిజిటల్ హెల్త్ రికార్డులతో పేషెంట్ కేర్ విధానంలో మెరుగైన మార్పులతో భారత డిజిటల్ హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని డెలాయిట్ ఇండియా లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్ ఇండస్ట్రీ లీడర్ జోయ్‌దీప్ ఘోష్ చెప్పారు. ఇదే సమయంలో హెల్త్‌కెర్ రంగం పూర్తి సామర్థ్యానికి తగిన స్థాయిలో ఏఐని వాడుకోవట్లేదని జోయ్‌దీప్ ఘోష్ అభిప్రాయపడ్డారు. నియంత్రణ విధానాలు, శ్రామికశక్తి శిక్షణ, మౌలిక సదుపాయాల్లో పరిమితులు వంటి సవాళ్లు ఉన్నాయి. వీటిని అధిగమిస్తే భారత్ ఏఐ-ఆధారిత హెల్త్‌కేర్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న దానికంటే వేగంగా ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల కంటే వెనుకబడే ఉందని నివేదిక పేర్కొంది.

Next Story