లావాదేవీ రుసుము వసూలు చేస్తే యూపీఐ వినియోగం 73 శాతం డౌన్

by Dishanational1 |
లావాదేవీ రుసుము వసూలు చేస్తే యూపీఐ వినియోగం 73 శాతం డౌన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్నేళ్లలో దేశంలో టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో, అదే స్థాయిలో అత్యంత వేగంగా యూపీఐ వాడకం కూడా వృద్ధి చెందుతోంది. గత నెలలోనూ దేశీయంగా 1200 కోట్ల యూపీఐ లావాదేవీల మార్కు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ రీసెర్చ్ సంస్థ లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు యూపీఐ లావాదేవీలకు ఫీజు వసూలు చేస్తే 73 శాతం మంది దాన్ని ఉపయోగించడాన్ని ఆపేస్తామని చెప్పారు. ప్రస్తుతం చాలావరకు లావాదేవీలు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. కూరగాయల దగ్గరి నుంచి హోటల్ బిల్లు వరకు దేశంలోని మెజారిటీ జనాభా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేస్తున్నారు. దీని వేగవంతమైన వృద్ధికి ప్రధాన కారణం యూపీఐ లావాదేవీలకు ఎలాంటి రుసుము లేకపోవడం. ఒకవేళ దీన్ని ప్రవేశపెడితే చాలామంది యూపీఐని తగ్గిస్తామని, లేదా వాడటం మానేస్తామని చెబుతున్నారు. దేశంలోని 364 జిల్లాలకు చెందిన 34 వేల మంది నుంచి సేకరించిన సమాచారంలో 67 శాతం మంది పురుషులు, 33 శాతం మంది మహిళలు ఉన్నారు. 23 శాతం మంది వినియోగదారులు యూపీఐ లావాదేవీలకు రుసుము భరించడానికి సిద్ధంగా ఉన్నారు. 73 శాతం మంది రుసుము విధిస్తే ఉపయోగించమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రతి ఇద్దరు యూపీఐ వినియోగదారుల్లో ఒకరు నెలకు 10కి పైగా లావాదేవీలు చేస్తున్నారు.

Next Story

Most Viewed