BREAKING : ఆయనను సీఎం చేయడమే షర్మిల లక్ష్యంగా కనబడుతోంది : వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING : ఆయనను సీఎం చేయడమే షర్మిల లక్ష్యంగా కనబడుతోంది : వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : టీడీపీ అధినేత చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే షర్మిల లక్ష్యంగా కనబడుతోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ సీఎం జగన్‌పై అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. నేరుగా రాజశేఖర్‌రెడ్డి పేరు చార్జీషీటులో చేర్చిందని ధ్వజమెత్తారు. దాదాపు 16 నెలల పాటు తన అన్నను జైలులో పెట్టిన విషయం షర్మిలకు గుర్తు లేదా అని ధ్వజమెత్తారు. ఆనాడు కాంగ్రెస్ నాయకులైన శంకర్‌‌రావు, టీడీపీ నాయకులు ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు కుమ్మక్కై సోనియా అండతో జగన్‌పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. నేడు షర్మిల మాట్లాడిన భాష.. చేస్తున్న హడావుడి చేస్తుంటే జాలి కలుగుతోందని అన్నారు. వైఎస్‌ఆర్ ఆశయాలకు కట్టుబడి జగన్ పని చేస్తున్నారని తెలిపారు.

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్‌ను ఏపీలోని ప్రజలంతా అక్కున చేర్చుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లోకి చేరగానే షర్మిల భాష, యాస పూర్తిగా మారిందని ఆరోపించారు. తన అన్న కోసం ఒకప్పుడు పార్టీలో తనవంతు పాత్ర పోషించిన షర్మిల.. నేడు జగన్‌ను తిట్టడం దురద‌ృష్టకరమని అన్నారు. తెలంగాణలో ఆమె ఏం చేసిందని.. ఇప్పుడు ఏపీకి వచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో విడిపోయిన నాడు ప్రత్యేక హోదా అనేది చట్టంలో పెట్టి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పునకు వైసీపీని నిలదీయడం ఏంటని మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికీ తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. షర్మిల వ్యాఖ్యలకు తాము ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి ఉందని అన్నారు. నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి రాలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు షర్మిల వచ్చి కొత్తగా చేసేది ఏమి లేదని సజ్జల అన్నారు. ఏది ఏమైనా చంద్రబాబును మళ్లీ సీఎం చేయడమే షర్మిల లక్ష్యంగా కనబడుతోందని అన్నారు.

Next Story

Most Viewed