వెల్గటూర్ శివారులో బాంబుల మోత.. భయబ్రాంతుల్లో ప్రజలు..

by  |
వెల్గటూర్ శివారులో బాంబుల మోత.. భయబ్రాంతుల్లో ప్రజలు..
X

దిశ, వెల్గటూర్ : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ గ్రామ శివారు ప్రాంతం నిత్యం బాంబుల చప్పుళ్లతో మారుమ్రోగుతోంది. వాగులో గల బండలను తొలగించేందు కోసం మోతదుకు మించిన మందు గుండును కంపెనీ వారు వినియోగిస్తూ భారీగా బోరు బ్లాస్టింగులు చేస్తున్నారు. బ్లాస్టింగ్ వల్ల వెల్గటూర్ తో పాటుగా చుట్టు పక్కల గ్రామాలు భూకంపం వచ్చినట్లు కంపించి పోతున్నాయి. పరిమితులను అతిక్రమించి, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నా.. అధికారులు ఎవ్వరు నోరు మెదపకపోవడం పట్ల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెల్గటూర్ గ్రామ శివారులో గల పెద్ద వాగులో కాళేశ్వరం లింకు2 ప్రాజెక్టులో భాగంగా పంప్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన పనిని మెగా కంపెనీ దక్కించుకొని పనులు చేస్తోంది.

కాగా ఇక్కడ మొదటి నుంచి వివాదాస్పదంగానే పనులు జరుగుతున్నాయి. భూసేకరణ జరిపి, గ్రామస్తుల అభిప్రాయం సేకరించిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం పనులను ప్రారంభించాల్సి ఉండగా అవేమి జరపకుండా కంపెనీవారు ఆగమేఘాల మీద పనులను ప్రారంభించారు. వాగులో చేపల కోసం మత్స్యకారులు నిర్మించుకున్న ఏడలు (బండలు పరిచి వాటిపై తడకలు వేసి చేపలు పట్టడం)తొలగించారు. వాగు పక్కనే గల ఈతవనం తొలగించేందుకు ప్రయత్నం చేశారు. దీనితో మత్స్యకారులు, గీత కార్మికులు కంపెనీ చేస్తున్న పనులను అడ్డగించి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏళ్ళ తరబడి ఇక్కడ వాగులో ఏడలను నిర్మించుకొని జీవనోపాధి పొందుతున్న మాకు ప్రాజెక్టు నిర్మాణం వలన అన్యాయం జరుగుతుందని, న్యాయం జరిగేలా చూడాలని మత్స్యకారులు మంత్రిని కోరారు.

వాగు పక్కన గల 7 వేల ఈత చెట్లు ప్రాజెక్టులో కనుమరుగై జీవనోపాధి కోల్పోతున్నామని గీత కార్మికులు మంత్రికి వివరించారు. ఈ మేరకు స్పందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ మత్స్యకారులకు 20 లక్షలు, గీత కార్మికులకు 43 లక్షల 35 వేల నష్ట పరిహారం మంజూరు చేయించారు. దీనితో ఇక్కడ కంపెనీవారు మళ్లీ పనులను ప్రారంభించారు. ఈ మేరకు జరుపుతున్న పనుల్లో మోతాదుకు మించిన మందుగుండును వినియోగిస్తూ పెద్ద మొత్తంలో బోర్ బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీనితో వెల్గటూర్ తో పాటుగా చుట్టుపక్కల గ్రామాలలో ఇల్లు బీటలు వారుతున్నాయి, ప్రహరీ గోడలు కూలిపోతున్నాయి. ఒక్కసారిగా పేలడంతో భూకంపం వచ్చినట్లు భూమి కంపిస్తుండగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇండ్లల్లో పైన ఉంచిన వస్తువులు కిందపడి పగిలి పోతున్నాయి.

భారీ మొత్తంలో బ్లాస్టింగ్ లు చేయకూడదని వెల్గటూర్, రాజక్కపల్లి గ్రామస్తులు రాష్ట్ర రహదారి పై పలు మార్లు ధర్నా, రాస్తారోకో చేసినా కంపెనీ వారు పట్టించుకోవడం లేదు. సంబంధిత అధికారులు మండల కార్యాలయంలో ఉండగానే భారీ పేలుళ్లు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి భారీ పేలుళ్ళు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని వెల్గటూర్ మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed