నో మాస్క్, నో డిస్టెన్స్.. బీజేపీ నాయకుల తీరుపై సర్వత్రా విమర్శలు

by  |
నో మాస్క్, నో డిస్టెన్స్.. బీజేపీ నాయకుల తీరుపై సర్వత్రా విమర్శలు
X

దిశ, కామారెడ్డి రూరల్ : ప్రపంచమంతా కరోనాతో గజగజ వణుకుతూ నోటికి మాస్క్‌లు పెట్టుకొని బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తుంటే, స్థానిక బీజేపీ నాయకులకు మాత్రం అవి ఏమీ పట్టడం లేదు. మాస్క్ లేకుండా, డిస్టెన్స్ లేకుండా బహిరంగంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వీరు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఎవరికైనా కరోనా ఉన్నట్లయితే మిగతావారి పరిస్థితి ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలు ఏమోగానీ ప్రజల ప్రాణాలు తోడేసే ఇలాంటి నాయకుల తీరు పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ కాటిపల్లి వెంకటరమణా రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం తో పాటు బహిరంగ సమావేశం శనివారం రోజున నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఎవరు కూడా మాస్క్ పెట్టుకోలేదు. డిస్టెన్స్ అసలు పాటించలేదు. కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు. ప్రజలను చైతన్యం చేసే ఓ నాయకుడే నిబంధనలు ఉల్లంఘిస్తుంటే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. ఓవైపు ప్రభుత్వం మాస్క్‌లు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ స్థలాల్లో కనిపిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తుంటే వీరికి మాత్రం ఈ నిబంధనలేవి వర్తించవా అని ప్రజలు నిలదీస్తున్నారు. మాస్కులు లేకుండా కనిపిస్తే జరిమానాలు విధించే పోలీసులకు, అధికారులకు ఇవేవి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.


Next Story

Most Viewed