మదుపర్లకు బ్లాక్ మండే!

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస పతనాలతో కుదేలవుతున్నాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో మదుపర్లు భారీ నష్టాలను చూడక తప్పలేదు. కొవిడ్ పరిణామాల తర్వాత ఆర్థికవ్యవస్థ పుంజుకుంటున్న సానుకూల పరిస్థితుల మధ్య సోమవారం సూచీలు 7 నెలల తర్వాత అత్యధిక పతనాన్ని చూశాయి. ఏప్రిల్ 12 తర్వాత అతిపెద్ద సింగిల్ డే పతనమని, షేర్ల విలువ గరిష్ఠ స్థాయిలకు చేరుకోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడ్డారని నిపుణులు అభిప్రాయపడ్డారు.

దేశీయ పరిణామాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో సోమవారం ట్రేడింగ్ ‘బ్లాక్ మండే’గా మిగిలిపోయిందని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,170.12 పాయింట్లు కుప్పకూలి 58,465 వద్ద, నిఫ్టీ 348.25 పాయిట్లు కుదేలై 17,416 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా 4.5 శాతం దిగజారగా, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ప్రైవేట్ బ్యాంక్, మీడియా, ఫైనాన్స్, ఆటో, బ్యాంకింగ్ రంగాలు 2-4 శాతం మధ్య దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పైంట్, పవర్‌గ్రిడ్ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని కంపెనీల షేర్లు క్షీణించాయి.

ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, ఎన్‌టీపీసీ, టైటాన్, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, మారుతీ సుజుకి, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఐటీసీ, ఎంఅండ్ఎం షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. స్టాక్ మార్కెట్లతో పాటు కీలక కంపెనీల షేర్లు నష్టపోతున్నప్పటికీ మరోవైపు ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ షేర్లు మాత్రం గరిష్ఠ లాభాలను సాధించాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి కంపెనీ షేర్ ధర 4 శాతం వరకు పెరిగి రూ. 741.35 వద్ద ర్యాలీ చేసింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.37 వద్ద ఉంది.


Next Story

Most Viewed