ఆగ్రోస్‌తో రైతులకు మెరుగైన సేవలు

by  |
Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆగ్రోస్ 2019-2020 సంవత్సరం లో రూ.123 కోట్ల పైచిలుకు టర్నోవర్ సాధించి ఎన్నో వినూత్న పథకాలతో ముందంజంలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం రెడ్ హిల్స్ లో అగ్రోస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు ఒకే గొడుగు కింద అందుబాటులో ఉంచడానికి మెరుగైన సేవలు అందించేందుకు ఆగ్రోస్ సంస్థను ఏర్పాటు చేశామన్నారు.

ఆగ్రోస్ సంస్థ ద్వారా నిరుద్యోగ వ్యవసాయ, సైన్స్ చదివిన గ్రాడ్యుయేట్స్ కి ఉపాధి కల్పించేందుకు 1000 “ఆగ్రో రైతు సేవా కేంద్రాలు” రాష్ట్రంలోని ప్రతి మండలంలో నెలకొల్పామన్నారు. భూసార పరీక్షా కేంద్రాలను సమర్ధవంతంగా నడపడానికి ఏఆర్ఎస్‌కేలు నడుపుతున్న ఔత్సాహిక వ్యవసాయ పట్టభద్రులకు, ఇతర సైన్స్ గ్రాడ్యుయేట్స్ కు అవకాశం కల్పిస్తామన్నారు. నాబార్డు, మేనేజ్, ఎస్ఎల్‌బిసి వంటి సంస్థల సహకారంతో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. కార్బైడ్ రహిత స్వచ్ఛమైన మామిడి, అరటి పండ్లను తెలంగాణ వినియోగదారులకు అందజేయడానికి ఎన్ రైప్ (సహజసిద్ధమైన ప్రోడక్ట్) ను అన్ని పండ్ల మార్కెట్ లలో అందజేస్తున్నామని తెలిపారు.

“తెలంగాణ సిరి” సిటీ కంపోస్టును ఆగ్రోస్ ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. భారత ప్రభుత్వ నిర్దేశాలను అనుసరించి ప్రతి ఆరు బ్యాగుల ఎరువులకు మూడు బ్యాగులు సిటి కంపోస్ట్ ను వాడి రైతులు తమ భూముల సారవంతం పెంచుకోవాలని, ఆగ్రోస్ అందించే సిటీ కంపోస్ట్ విరివిగా వాడాలని సూచించారు. పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని సమూలంగా నిర్మూలించడానికి బయోడిగ్రేడబుల్ కంపోస్ట్ బ్యాగులను (మట్టిలో కలిసిపోయే విధంగా) పంపిణీ చేయడానికి తెలంగాణ ఆగ్రో చర్యలు చేపట్టిందన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ఆగ్రోస్ కు తిరుమలలో లడ్డూ ప్రసాదానికి కౌంటర్ ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఈ బ్యాగులను వాడుకలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణకు నాణ్యమైన వ్యవసాయ యంత్రాలు పనిముట్లు తెలంగాణ ఆగ్రో ద్వారా సబ్సిడీ, నేరుగ రైతాంగానికి అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఆగ్రో కర్షక పెట్రోల్ బంకులు నెలకొల్పి నాణ్యమైన పెట్రోల్, డీజిల్ ను అందజేసి యువతకు ఉపాధిను అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఆగ్రోస్ చేపడుతున్న, చేపట్టబోయే వినూత్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ ఎండీ రాములు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed